వంశీ! కేసులకు భయపడి ఇలానా? నీది టీడీపీ డీఎన్ఏ: రంగంలోకి కేశినేని నాని, ఆసక్తికర వ్యాఖ్యలు
అమరావతి: తెలుగుదేశం పార్టీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. అంతేగాక, పూర్తిగా రాజకీయాల నుంచే వైదొలుగుతున్నట్లు ప్రకటించి సంచలనంగా మారారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.
వంశీది టీడీపీ డీఎన్ఏ
తాజాగా, విజయవాడ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కేశినేని నాని కూడా రంగంలోకి దిగారు. గన్నవరం ఎమ్మెల్యే వంశీమోహన్ది టీడీపీ డీఎన్ఏ అని కేశినేని నాని వ్యాఖ్యానించారు. వంశీని వదులుకునేందుకు టీడీపీ సిద్ధంగా లేదని ఆయన అన్నారు. ఈ విషయంలో వంశీ మోహన్తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు.
కేసులకు భయపడతావా?
వంశీలాంటి మంచి రాజకీయ నేత రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది కాదని కేశినేని నాని అభిప్రాయపడ్డారు. వంశీ తరపున పోరాడేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. కేసులకు భయపడి రాజకీయాలకు దూరంగా ఉండొద్దని సూచించారు.
టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా
కాగా, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వంశీమోహన్ ఆ పార్టీ అధినేతకు ఆదివారం లేఖ రాసిన విషయం తెలిసిందే. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కొందరు ప్రభుత్వ అధికారులు వల్ల తన అనుచరులు, మద్దతుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వారి ఇబ్బందులను తొలగించేందుకే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.
అండగా ఉంటానంటూ చంద్రబాబు
ఇక వంశీ లేఖకు చంద్రబాబు కూడా సమాధానమిచ్చారు. వ్యక్తిగతంగానే కాకుండా పార్టీ పరంగానూ వంశీకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పార్టీ పట్ల వంశీకున్న అంకితభావం, పోరాటాలు మరిచిపోలేనివని అన్నారు. వంశీని బుజ్జగించి, సమస్యను పరిష్కరించే బాధ్యతను విజయవాడ ఎంపీ కేశినేని నానికి, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణకు అప్పగించారు చంద్రబాబు. కాగా, తన లేఖకు స్పందించినందుకు చంద్రబాబుకు వంశీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి తన సేవల్ని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
చంద్రబాబుకు లేఖలో వంశీ ఇలా..
‘మీ నేతృత్వంలో ప్రజాప్రతినిధిగా పనిచేసేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎమ్మెల్యేగా విజయవంతంగా పదవీకాలం పూర్తి చేసి రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను' అని చంద్రబాబునాయుడుకు రాసిన లేఖలో వంశీ పేర్కొన్నారు. అంతేగాక‘నా అనుచరులు, మద్దతుదారులు.. స్థానిక వైసీపీ నేతలు, కొందరు ప్రభుత్వ అధికారులు వైఖరి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం నా దృష్టికి వచ్చింది.
అయితే, వారి ఇబ్బందులను తొలగించేందుకు వేరే వాళ్లతో చేతులు కలిపే అవకాశం ఉన్నా నా మనస్సాక్షి అందుకు అంగీకరించడం లేదు. అందుకే ఓ నిర్ణయానికి వచ్చా. పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా' అని వంశీ తన లేఖలో స్పష్టం చేశారు. అనవసర శత్రుత్వం వద్దనుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వల్లభనేని వంశీ తెలిపారు. అందుకే పార్టీ సభ్యత్వానికి, ఎమ్యెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబుకు రాసిన లేఖలో వంశీ పేర్కొన్నారు. గత కొంత కాలంగా వంశీ పార్టీ మారుతారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.