సినిమా వాళ్ల జోలికి వెళ్లడం వల్లే జగన్ ఓడిపోయారు..కేతిరెడ్డి షాకింగ్ కామెంట్స్
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ దారుణ ఓటమిని చవి చూసింది. ఆ పార్టీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. జగన్ ఓటమిని ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలతో పాటు, యావత్తు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా కోరుకుంది. జగన్ ప్రభుత్వంలో సినీ ఇండస్ట్రీ అనేక ఇబ్బందులను ఫేస్ చేసిందని పలువురు అభిప్రాయడ్డారు.
ముఖ్యంగా టికెట్ల రేట్ల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల పెద్ద సినిమాల నిర్మాతలు చాలా ఇబ్బంది పడ్డారు. పైగా మెగాస్టార్ చిరంజీవిని సైతం జగన్ అవమానించారని భావించిన సినీ ఇండస్ట్రీ ఎట్టి పరిస్థితుల్లో జగన్ తిరిగి విజయం సాధించకూడదని భావించారు. దీనిలో భాగంగానే కూటమి అభ్యర్ధులకు బహిరంగంగానే ఇండస్ట్రీకి చెందిన పలువురు తమ మద్దతు ప్రకటించారు.

అందరు అనుకున్నట్టే జగన్ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. తాజాగా పార్టీ ఓటమిపై వైసీపీ కీలక నేత , మాజీ మంత్రి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కీలక కామెంట్స్ చేశారు. సినిమా వాళ్ల వల్లే వైసీపీ ఓడిపోవడం జరిగిందన్నారాయన. సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం మంచి విషయమే అయినప్పటికి , అది ప్రజలకు ఎక్కలేదని కేతిరెడ్డి తెలిపారు.
ప్రజలు తమ అభిమాన హీరోల సినిమాలను ఎంత ఖర్చు పెట్టి అయినా సరే బ్లాక్లో అయినా కొనుక్కుని చూస్తారని.. వాళ్లకు లేని బాధ మనకెందుకు అని కేతిరెడ్డి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. సినిమా టికెట్ రేట్లు తగ్గించి మనం చెడును మూటగట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. సినిమా వాళ్లకు మంచి చేసి ప్రజలకు దూరమయ్యామన్నారు.సినిమా టికెట్ రేట్లు తగ్గించి సినిమా వాళ్లతో నిందలు పడ్డామని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చెప్పారు. ఎవరి జీవితం వాళ్లదని.. సినిమా టికెట్ల రేట్ల గురించి మనకెందుకని కుండబద్దలు కొట్టేశారు. సినిమా టికెట్ రేట్ల జోలికి తాము పోకుండా ఉండాల్సిందన్నారు.












Click it and Unblock the Notifications