తాగేసి భర్త ఆమె కంట్లోకి బాణమేశాడు: వైద్యులు తీసేశారు
విశాఖపట్నం: మహిళ కంట్లో నుంచి లోపలకి చొచ్చుకువెళ్లిన బాణాన్ని విశాఖపట్నంలోని కెజిహెచ్ వైద్యులు శస్తచ్రికిత్స ద్వారా విజయవంతంగా బయటకు తీశారు. విశాఖ ఏజెన్సీలోని గూడెం కొత్తవీధికి చెందిన బి సుభద్ర (40)పై ఈ నెల 11వ తేదీన ఆమె భర్త మద్యం మత్తులో బాణం వేయడంతో అది ఆమె కంట్లోనుంచి మెదడులోకి చొచ్చుకుని వెళ్లింది.
దీంతో ఆమెను స్థానికంగా ఆసుపత్రుల్లో చూపించి, అక్కడి వైద్యుల సూచనల మేరకు 12న విశాఖ కెజిహెచ్కు తరలించారు. కెజిహెచ్ వైద్యుల బృందం అదే రోజు శస్తచ్రికిత్స చేసి, ఆమె పుర్రెను తెరిచి బాణాన్ని బయటకు విజయవంతంగా బయటకు తీశారు. ఈ విషయం సోమవారం మీడియాకు తెలియచేశారు.
ఈ శస్త్ర చికిత్సలో న్యూరాలజీ వైద్య బృందం డాక్టర్ కె సత్యవరప్రసాద్, డాక్టర్ పి ప్రహ్లాద, డాక్టర్ పి కృష్ణ రాజీవ్, డాక్టర్ కెఎస్ఆర్ కృష్ణ, డాక్టర్ మురళీకృష్ణ, గణేష్, డాక్టర్ ఫణి, ఆప్తామాలజీ బృందం డాక్టర్ నర్సింగరావు, డాక్టర్ తారకేశ్వరరావు, డాక్టర్ నిర్మల జ్యోతి, డాక్టర్ జ్యోత్స్న పాల్గొన్నారు.
విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించినందుకు కెజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదనబాబు వైద్యులను అభినందించారు. మహిళ కుడి కంట్లోంచి మెదడులోకి చొచ్చుకుని వెళ్లిన బాణాన్ని వైద్యులు తొలగించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.