సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితిపై కిల్లి, కీలక నేతలు: హరీష్
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ పైన సీమాంధ్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్న మాట నిజమేనని, తమ పార్టీకి కొన్ని చోట్ల అభ్యర్థులు కూడా దొరగటం లేదని కేంద్రమంత్రి కిల్లి కృపారాణి వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీకి కొన్ని చోట్ల అభ్యర్థులు కూడా కరువయ్యారన్నారు.
అయితే తాము చేపడుతున్న బస్సుయాత్రలో సీమాంధ్ర ప్రజలకు అన్ని విషయాలను వివరించి వాస్తవాలను చెబుతామన్నారు. ఇతర పార్టీలు అసత్య ప్రచారం చేస్తూ ప్రజల మనసును మారుస్తున్నాయన్నారు. రానున్న ఐదు, పదేళ్లలో సీమాంధ్ర ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
కీలక నేతలు తెరాసలోకి: హరీష్ రావు
మరికొద్ది రోజుల్లో పలువురు కీలక నేతలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారని ఆ పార్టీ సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు వేరుగా అన్నారు. వివిధ పార్టీల నేతలు తమతో టచ్లో ఉన్నారని, తాము పార్టీకి అవసరమైన వారిని మాత్రమే చేర్చుకుంటామని, సాధారణ ఎన్నికల్లో పొత్తులపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు.
హంగ్ ప్రభుత్వం: రేవూరి
తెలంగాణలో హంగ్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. తాను, ఎర్రబెల్లి దయాకర రావు పార్టీ మారుతున్నామని ప్రచారం చేసి తెరాస లబ్ది పొందాలనుకుంటోందన్నారు. తాము పార్టీ మారేది లేదన్నారు. తెలంగాణలో టిడిపి పాలక వర్గాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, హంగ్ ప్రభుత్వం వస్తుందన్నారు.
టిడిపి కాదు.. తెలుగు కాంగ్రెసు పార్టీ: రుద్రరాజు
తెలుగువారి ఆత్మ గౌరవం నినాదంతో వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఉనికిని కోల్పోయిందని ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు అన్నారు. లెక్కలేనంత మంది కాంగ్రెస్ నేతలను చేర్చుకుని ఇప్పుడు తెలుగు కాంగ్రెస్ పార్టీగా అవతరించిందని ఎద్దేవా చేశారు. వలస నాయకులను ఆహ్వానిస్తున్న చంద్రబాబుకు నష్టం వాటిల్లుతుందన్నారు. రాజకీయ లబ్ధి కోసం కెసిఆర్ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు.