మెడికల్ కాలేజీల పీపీపీ టెండర్ పై ట్విస్ట్..! తేల్చేసిన కిమ్స్ ..!
ఏపీలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే విపక్ష వైసీపీ ఈ వ్యవహారంలో ఆందోళనలు చేయడంతో పాటు కోటి సంతకాలు సేకరించి గవర్నర్ కు అందజేసింది. ఈ నేపథ్యంలో తాజాగా మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోనిలో మెడికల్ కాలేజీల నిర్మాణాలకు ప్రభుత్వం విధించిన గడువు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఇందులో ఓ మెడికల్ కాలేజీకి కిమ్స్ ఆస్పత్రి టెండర్ దాఖలు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఏపీలో పీపీపీ విధానంలో చేపట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వీజీఎఫ్ సహ ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని తాజాగా జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వం తొలి విడతగా ఆదోని, మదనపల్లి, పులివెందుల, మార్కాపురం మెడికల్ కాలేజీలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను అధికారులు సీఎంకు వివరించారు. నాలుగు మెడికల్ కాలేజీలకు పీపీపీ విధానంలో నిర్మించి, నిర్వహించేలా సెప్టెంబరు 18న ప్రభుత్వం టెండర్లు పిలిచిందన్నారు. ఇందులో ఆదోని మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ఓ సంస్థ ముందుకు వచ్చిందని అధికారులు సీఎంకు తెలిపారు. ముందుకు వచ్చిన సంస్థతో ఒప్పందం చేసుకుని కాలేజ్ నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను సూచించారు.

అయితే ఇలా ఆదోనిలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి తాము ముందుకొచ్చి బిడ్ దాఖలు చేసినట్లు వచ్చిన వార్తల్ని కిమ్స్ యాజమాన్యం తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఆదోనిలో మెడికల్ కాలేజీకి తాము ఎలాంటి టెండర్లు వేయలేదని చెప్పినట్లు సమాచారం. దీంతో అధికారులు ఇలా ఎందుకు సీఎంకు సమాచారం ఇచ్చారన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అదే సమయంలో మిగిలిన మార్కాపురం, మదనపల్లె, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణానికి అసలు బిడ్లే రాలేదని కూడా తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications