టి తన వల్లే అన్నారు: బాబుపై కిరణ్, బాలశౌరి సవాల్
ప్రకాశం: ఇటీవల వరంగల్ జిల్లాలో నిర్వహించిన సభలో తెలంగాణ రాష్ట్రం తన వల్లే వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడులో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర విభజనకు టిడిపి అధినేత చంద్రబాబు నాయడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలే కారణమని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని రాష్ట్ర విభజన చేయవద్దని ఎంత చెప్పినా వినలేదని ఆయన అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని వీడినట్లు చెప్పారు.
చంద్రబాబుకు బాలశౌరి సవాల్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వల్లభనేని బాలశౌరి సవాల్ విసిరారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో అన్నట్లుగా.. సీమాంధ్రలోని గుంటూరు జిల్లాలో జై తెలంగాణ అనగలరా అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో ఒక మాట, సీమాంధ్రలో మరో మాట చంద్రబాబుకే చెల్లిందని ఆయన దుయ్యబట్టారు.