ఆపడం, లేదంటే రాజీనామా: తెలంగాణపై కిరణ్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకుంటుందని తనకు ముందే తెలియదని, నిర్ణయాన్ని చెప్పిన వెంటనే వ్యతిరేకించానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనలో పాలు పంచుకోలేనని చెప్పినట్లు ఆయన తెలిపారు. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణతో బిగ్ డిబేట్ కార్యక్రమంలో ఆయన ఆ విధంగా అన్నారు. రాధాకృష్ణ వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇస్తూ వెళ్లారు.
తన మనస్సాక్షికి విరుద్ధంగా వెళ్లలేనని చెప్పినట్లు కిరణ్ తెలిపారు. వీలైనంత వరకు రాష్ట్ర విభజనను ఆపాలనేదే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాష్ట్ర విభజన జరగదని అనడంపై వేసిన ప్రశ్నకు ఆయన ఆ విధంగా అన్నారు. తన నిర్ణయం సులువుగా మారదని ఆయన అన్నారు. కోట్లాది మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించిందని, ఇన్ని తిప్పలు వస్తాయని చెప్పలేదనే అపవాదును వేసుకోలేదని ఆయన అన్నారు.
ఆపడం, లేదంటే రాజీనామా చేయడమనే రెండు ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉన్నాయని రాధాకృష్ణ అంటే తన ముందు అవి మాత్రమే ఉన్నాయని ముఖ్యమంత్రి అంగీకరించారు. అధిష్టానం మాత్రమే ఆలోచన చేసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన ఆగుతుందనే నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రం కలిసి ఉండాలని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. తాను హైదరాబాదులో పుట్టి పెరిగానని ఆయన అన్నారు. హైదరాబాదుతో అనుబంధం సెంటిమెంట్ ఉందని అన్నారు.
తాను రాజీనామా చేయాలా, వారు వెనక్కి పోవాలా అనేది రాజకీయంగా సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. అధిష్టానంతో ఢీకొట్టడం కాదని, విభజనపై వెనక్కి తగ్గడానికి ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తానని ఆయన అన్నారు. సమస్య పరిష్కారం కాదని ఆయన అన్నారు. చిన్న సమస్యను పరిష్కరించడానికి పెద్ద సమస్యను తెచ్చుకోవడం సరి కాదని ఆయన అన్నారు.
ఓసారి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఇవ్వాలని కోరానని, ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా చెప్పానని ఆయన అన్నారు. విభజన వల్ల రాష్ట్రానికే కాకుండా పార్టీకి కూడా నష్టమని ఆయన అన్నారు. తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానాన్ని కొంత మంది తప్పుదోవ పట్టించారని, విభజన నిర్ణయం తీసుకుంటే సీమాంధ్రలో ఉద్యమాలు తలెత్తవని చెప్పారని, అయితే లావాలా ఉద్యమం ఎగిసిపడిందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం కన్నా తీవ్ర స్థాయిలో సీమాంధ్రలో ఉద్యమం సాగుతోందని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన జరుగుతుందని ఎవరూ అనుకోలేదని, తెలంగాణ అంశాన్ని తీవ్రంగా తీసుకోలేదని, ప్యాకేజీల డిమాండ్గానే భావించామని, శ్రీకృష్ణకమిటి ఆరో ప్రతిపాదనను అమలు చేస్తారని అనుకున్నామని ఆన అన్నారు. విడిపోతే ఇరు ప్రాంతాల్లో నక్సలిజం పెరుగుతుందని ఆయన అన్నారు. ఇచ్చిన మాట కోసమే తెలంగాణ నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. ఓ హోదాలో ఉన్నా తాను సమైక్యవాదినే అని, ఇబ్బందికరమైన పరిస్థితిలో తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టానని ఆయన అన్నారు.
విభజన వల్ల తెలంగాణకు కూడా నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీలో అభిప్రాయాలను చెప్పే స్వేచ్ఛ ఉందని, ఇంత స్వేచ్ఛ ఎక్కడా ఉండదని తాను అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు వచ్చిన ఆరోపణలపై వేసిన ప్రశ్నకు సమాధానంగా అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనపై పార్టీ అధిష్టానం పునరాలోచన చేస్తుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. పార్టీ కన్నా, వ్యక్తి కన్నా ప్రజల అభిప్రాయం ముఖ్యమని ఆయన న్నారు.
రాష్ట్ర విడిపోతే విద్యుత్తు, సాగునీటి రంగాల్లో సమన్వయం కుదరదని ఆయన అన్నారు. హైదరాబాదులోనే పరిశ్రమలు, సంస్థలు ఉన్నాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో మిగతా నగరాలను అభివృద్ధి చేయకపోవడం తప్పేనని ఆయన అన్నారు. తెలంగాణపై ఇప్పటి వరకు అర్థవంతమైన చర్చ జరగలేదని ఆయన అన్నారు. తెలంగాణకు లక్ష కోట్ల రూపాయలకు పైగా ప్యాకేజీలు ఇవ్వాలని తాను పార్టీ అధిష్టానానికి సూచించినట్లు ఆయన తెలిపారు. సీమాంధ్ర ఉద్యమంలో ప్రజలు, ఉద్యోగులే ఉన్నారని, పార్టీలు లేరని ఆయన అన్నారు. మంత్రుల బృందం వివిధ రంగాలకు సంబంధించి ఏ విధంగా చేస్తారో చూద్దామని ఆయన అన్నారు.