విభజనపై సుప్రీంకు కిరణ్: పార్టీపై సర్వే, నేడు నిర్ణయం
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి న్యాయపోరాటం ప్రారంభించారు. విభజనపై కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని సవాల్ చేస్తూ కిరణ్ మంగళవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రాన్ని రాజ్యాంగ విరుద్ధంగా విభజించారని కోర్టు మెట్టెక్కారు. కేంద్రాన్ని ప్రతివాదిగా చేర్చారు.
అసెంబ్లీకి అసలైన బిల్లును కాకుండా ముసాయిదా బిల్లు పంపడం, అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటు ఆమోదం కోసం పంపడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారని సమాచారం. గతంలో పిటిషన్లు దాఖలైనప్పుడు సరైన సమయంలో రాలేదని సుప్రీం వాటిని తిరస్కరించింది.
ఇప్పుడు ప్రక్రియ మొత్తం దాదాపుగా పూర్తయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంను ఆశ్రయించాలని కిరణ్ నిర్ణయించుకుని పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టికల్ 371(డి)కి సంబంధించి రాజ్యాంగ సవరణ చేయకపోవడాన్ని ఆయన ప్రస్తావించినట్లు తెలిసింది. నదీ జలాల వివాదం, ఉమ్మడి రాజధాని అంశాలనూ పేర్కొన్నారు. అసలు విభజనకు సరైన ప్రాతిపదికే లేదని తన పిటిషన్లో పేర్కొన్నారు.
కొత్త పార్టీపై నేడు నిర్ణయం
రాజకీయ పార్టీపై అడుగు ముందుకే వేయాలని కిరణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎడతెగని సంప్రదింపులు జరిపిన కిరణ్.. బుధవారం పార్టీ స్థాపనపై తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ బహిష్కృత ఎంపీలు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, మేధావులు, సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతూ వచ్చిన కిరణ్ చేతికి ఇటీవల క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వే నివేదికలు అందినట్లు తెలుస్తోంది.
సీమాంధ్ర ప్రాంతంలో నిర్వహించిన ఈ సర్వేలో కిరణ్ పార్టీ పట్ల ప్రజల నుంచి మంచి స్పందనే వచ్చిందని అంటున్నారు. మంగళవారం కిరణ్తో మాజీ మంత్రులు శైలజానాథ్, పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ, ఎమ్మెల్సీ రంగారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ తదితరులు సమావేశమయ్యారు.
కాగా, రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ సుప్రీంలో ఇప్పటి వరకూ ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి. బిజెపి నాయకుడు రఘురామ కృష్ణంరాజు, సర్ల రూప్చంద్ కల్ర, రవితేజ పదిరి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, గోపీకృష్ణ కొన్ని రోజుల కిందట పిటిషన్లు దాఖలు చేశారు. ఈ ఐదు పిటిషన్లపై ఈనెల 7వ తేదీన న్యాయమూర్తులు జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ ఎస్ఏ బాబ్దేలతో కూడిన ధర్మాసనం ఒకేసారి విచారణ చేపట్టనుంది.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ న్యాయవాది మనోహర్ లాల్ శర్మ కూడా వేరొక పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ను ఆయన బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు న్యాయమూర్తులు జస్టిస్ దత్తు, జస్టిస్ బాబ్దేల ధర్మాసనం ముందు ప్రస్తావించనున్నారు. మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ తదితరులు కూడా పిటిషన్లు దాఖలు చేస్తున్నట్లు సమాచారం.