మంత్రులూ పోడియంవద్దకు: కిరణ్పై దామోదర నిప్పులు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నోటీసు పైన సోమవారం సభలో మరోసారి గందరగోళం ఏర్పడింది. తొలిసారి వాయిదా పడిన శాసన సభ రెండసారి సమావేశమైంది. అయితే, కిరణ్ ఇచ్చిన నోటీసును తిరస్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెసు, టిటిడిపి ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. సభలో గందగోళం ఏర్పడటంతో సభాపతి గంటపాటు శాసన సభను వాయిదా వేశారు.
మంత్రులు పోడియం వద్దకు వెళ్లిన చరిత్ర లేదు
అంతకుముందు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ... మంత్రులు పోడియం వద్దకు వెళ్లిన చరిత్ర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసును తిరస్కరించకుంటే సభలో తమ విజృంభన చూస్తారని తెలిపారు. కిరణ్ తన నోటీసును వెనక్కి తీసుకునే వరకు తాము సభను నడవనచ్చేది లేదన్నారు.
తెలంగాణ మంత్రులు పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారంటే తాము ప్రభుత్వంలో లేమని పరోక్షంగా చెప్పినట్లే అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని తాము సభా నాయకుడిగా గుర్తించడం లేదన్నారు. ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆయనను బర్తరఫ్ చేయాలన్నారు.
కాగా, కిరణ్ ఇచ్చిన నోటీసును సభాపతి తిరస్కరించాల్సిందేనని ఇతర టి నేతలు చెబుతున్నారు. లేదంటే తాము సభను అడ్డుకుంటామని టిటిడిపి, టి కాంగ్రెసు, తెరాస తదితర పార్టీల నేతలు చెబుతున్నారు.
బిల్లులో లోపాలు: రామచంద్రయ్య
తెలంగాణ ముసాయిదా బిలలులో లోపాలున్నాయని తాము బిఏసిలోనే చెప్పామని మంత్రి సి రామచంద్రయ్య అన్నారు. ఓటింగ్ జరిగితే మెజార్టీ సభ్యులు ఎటు ఉన్నారో తెలుస్తుందన్నారు. మండలిలో సభా నాయకుడిగా తనకు నోటీసు ఇచ్చే అధికారం ఉందన్నారు. నోటీసు ద్వారా సభ అభిప్రాయం చెప్పాలని, నోటీసును తిరస్కరించడమా లేదా ఆమోదించడమా అన్నది చైర్మన్ పరిధిలోని అంశమన్నారు. తాను రాజ్యాంగానికి లోబడే నోటీసు ఇచ్చానని చెప్పారు.