ఢిల్లీకి వినిపించాలి: మళ్లీ కిరణ్ రెడ్డి సమైక్య గళం
విజయవాడ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి సమైక్య గళం విప్పారు. శనివారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రసంగించారు. "రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటే చేతులెత్తండి, సరిపోలేదు, ఢిల్లీకి వినిపించాలి" అని ఆయన సభకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండడం వల్నలే సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలును అమలు చేయగలుగుతున్నామని, పులిచింతల వంటి ప్రాజెక్టులు నిర్మించుకోగలుగుతున్నామని, రాష్ట్రం విడిపోతే అది సాధ్యం కాదని ఆయన అన్నారు.
ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడకపోతే నాగార్జున సాగర్ ప్రాజెక్టును కట్టుకోగలిగి ఉండేవాళ్లం కాదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన వల్ల చాలా సమస్యలు వస్తాయని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన వల్ల మనకు ఎక్కువ సమస్యలు వస్తాయని అనుకుంటున్నారని, కానీ తెలంగాణ ఎక్కువ నష్టపోతుందని ఆయన అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఒక్క ప్రాంతానికి నీరు ఇస్తూ, మరో ప్రాంతానికి విద్యుత్తు ఉత్పత్తి చేసి ఇస్తున్నామని, రాష్ట్రం విడిపోతే అది సమస్యగా మారుతుందని ఆయన అన్నారు. ఏ రాష్ట్రం కిందికి శ్రీశైలం ప్రాజెక్టు వస్తుందని ఆయన అడిగారు.
రాష్ట్రం కలిసి ఉండడం వల్ల నీటిని సర్దుబాటు చేస్తున్నామని, విడిపోతే అది సాధ్యం కాదని, కేంద్ర ప్రభుత్వం నికర జలాల గురించి మాత్రమే మాట్లాడుతుందని ఆయన అన్నారు. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి మిగులు జలాలను వాడుకునే హక్కు మనకు సంక్రమంచిందని, వాటి ఆధారంగా ప్రాజెక్టులు నిర్మించుకున్నామని, ఆ మిగులు జలాలపై హక్కు కోల్పోవాల్సి వస్తుందని, అందుకే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతున్నామని ముఖ్యమంత్రి అన్నారు.
రాష్ట్రం సమైక్యంగా ఉంటే అక్టోబర్ నాటికి పంటలు వచ్చేలా చూసుకోగలమని, దానివల్ల తుఫాను నుంచి కాపాడుకోగలుగుతామని ఆయన అన్నారు. తెలంగాణకు విభజన వల్ల నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణలో యాభై శాతం విద్యుత్తు కొరత ఏర్పడుతోందని, ఎత్తిపోతల పథకాల ద్వారా యాభై, 60 లక్షల ఎకరాలకు నీరు అందించాల్సి ఉందని, తెలంగాణ కోసం అదనంగా 175 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేయాల్సి ఉంటుందని, దానికి 45 వేల కోట్లు రూపాయలు ఖర్చవుతాయని, తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే 60,70 వేల కోట్ల రూపాయలు కావాలని, రాష్ట్రం సమైక్యంగా ఉంటే ఈ సమస్యలను అధిగమించగలమని ఆయన అన్నారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా మనకు ఉద్యోగుల విషయంలో 371డి చట్టం ఉందని, దానివల్ల ఎవరు ఏ ప్రాంతంలో పనిచేస్తున్నారో తెలియని పరిస్థితి ఉందని, లక్షల మంది ఆంధ్రావాళ్లు తెలంగాణలోనూ లక్షల మంది తెలంగాణవాళ్లు ఆంధ్రలోనూ పనిచేస్తున్నారని, విభజన జరిగితే సీనియారిటీ సమస్యలు వస్తాయని, పింఛన్ల సమస్య కూడా వస్తుందని ఆయన అన్నారు. సమైక్యం రాజకీయ నినాదం కాదని, రాజకీయం కోసం సమైక్య నినాదం ఇవ్వడం లేదని, ప్రజలకు ఇబ్బందులు వస్తాయని మాత్రమే మాట్లాడుతున్నానని, ఆలోచించాలని మాట్లాడుతున్నానని ఆయన అన్నారు.
ప్రపంచ కుగ్రామమైపోతోందని, మనవాళ్లు చాలా తెలివైనవారని, కష్టపడి పనిచేస్తారని, ప్రపంచలోని వివిధ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని, ప్రపంచంలోని 14 వేల విమానాలకు హైదరాబాద్ నుంచి సంకేతాలు అందిస్తున్నామని, విమానం వేల కిలోమీటర్ల పైన అమెరికా, లండన్ల్లో ఎగురుతుంటే సాంకేతిక అంశాలపై సలహాలు ఇస్తున్నామని ఆయన చెప్పారు. సాంకేతిక పరిజ్ఝానం పెరిగిందని, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కలిసి ముందుకు పోవాలని కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన అన్నారు.
విభజన వల్ల సంభవించే నష్టాలను తాను ఈ నెల 18వ తేదీన జివోఎం ముందు చెప్తానని, ప్రజల మనోభావాలను చెప్పే విషయంలో వెనక్కి తగ్గేది లేదని, విభజనకు కాంగ్రెసు నిర్ణయం తీసుకున్నందుకు చింతిస్తున్నామని ఆయన అన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు నాయుడికి తెలుగువారు కలిసి ఉండాలనే తపన ఉండాలని, కానీ విభజిస్తే ఏమిటని అంటున్నారని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి తెలివి లేదని చెప్పి ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని వైయస్సార్ కాంగ్రెసు సూచించిందని ఆయన అన్నారు. కాంగ్రెసుకు చెందిన తెలంగాణ నాయకులు విభజన కావాలని అంటున్నారని, అయితే సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు నాయకులు విభజనను వ్యతిరేకిస్తున్నారని, ప్రజల మనోభావాలకు అనుగుణంగా వారు వ్యవహరిస్తున్నారని కిరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర సమైక్యతకు శాయశక్తులా కృషి చేస్తానని ఆయన చెప్పారు.