సిఎం కిరణ్ రెడ్డి రాజీనామా: మళ్లీ మారిన తేదీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసే తేదీ ఏ రోజుకా రోజు మారుతూ వస్తోంది. తాజాగా ఆయన రాజీనామా చేసే తేదీని మీడియా రేపటికి (బుధవారానికి) మార్చింది. ఆయన రేపు ఉదయం 11 గంటలకు రాజీనామా చేయనున్నట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. దానికి ముందు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతారని చెబుతున్నారు.
తాను రాజీనామా చేసే విషయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర మంత్రులకు, శాసనసభ్యులకు తెలియజేసినట్లు చెబుతున్నారు. నిజానికి, కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు రాజీనామా చేస్తారంటూ ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.

ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారని, కొత్త పార్టీ పెడుతారని ఆయనను కలిసిన మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి చెప్పారు. అయితే, ముఖ్యమంత్రి రాజీనామా చేసే లోగానే ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. గంటా శ్రీనివాస రావు, ఏరాసు ప్రతాప రెడ్డి తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు.
ఢిల్లీలో ఉన్న గంటా శ్రీనివాస రావు పార్టీకి, మంత్రిపదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేస్తూ తన లేఖను ఆయన ఢిల్లీ నుంచి ఫాక్స్ ద్వారా గవర్నర్ నరసింహన్కు పంపించారు. మరో ఇద్దరు శాసనసభ్యులు కూడా కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications