సోనియాను కలవకుండానే కిరణ్ రెడ్డి వెనక్కి
న్యూఢిల్లీ: ఎఐసిసి ఉపాధ్యక్షుడు ఏర్పాటు చేసిన కాంగ్రెసు పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవకుండానే హైదరాబాద్కు తిరుగుముఖం పట్టారు. ఆయన శుక్రవారంనాడు ముఖ్యమంత్రుల సమావేశానికి మాత్రమే పరిమితమయ్యారు. సమైక్య రాగం వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి సోనియాను కలుసుకోకపోవడంపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
కాంగ్రెసుతో కిరణ్ కుమార్ రెడ్డి తెగదెంపులు చేసుకోవడం ఖాయమని, జనవరి 23వ తేదీ తర్వాత కొత్త పార్టీ పెడుతారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి మదిలో ఏముందనే విషయం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇంకా చివరి బంతి మిగిలే ఉందన్న ముఖ్యమంత్రి రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి ఏం చేస్తారనేది కూడా తెలియడం లేదు.

కాగా, ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వద్ద ఆయన రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గట్టిగానే మాట్లాడినట్లు చెబుతున్నారు. రెండు విడతలుగా ఆయన రాహుల్ గాంధీతో దాదాపు గంట పాటు మాట్లాడారు. రాష్ట్ర విభజనను ఆపాలని ఆయన రాహుల్ గాంధీని కోరినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, పార్టీని రక్షించాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నారు.
విభజన వల్ల సీమాంధ్ర, తెలంగాణ రెండూ నష్టపోతాయని ఆయన చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర విభజన ఏకపక్షంగా జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారని అంటున్నారు. రాజధానితో కూడిన కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామనడం దేశ చరిత్రలోనే లేదని, ఒకరు రాష్ట్రాన్ని అడిగితే వేరేవారిని వెళ్లిపోవాలని చెప్పడం సరి కాదని ఆయన రాహుల్ గాంధీతో అన్నట్లు చెబుతున్నారు. విభజన జరిగితే రెండు ప్రాంతాల్లోనూ పార్టీకి నష్టం జరుగుతుందని, తెలంగాణలో కూడా పార్టీకి ప్రయోజనం చేకూరదని ఆయన చెప్పినట్లు ప్రచారం సాగుతోంది.
కాగా, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఢిల్లీకి వస్తున్నారు. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఢిల్లీలోనే ఉన్నారు. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధిష్టానం వారిద్దరితో చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications