సమైక్యాంధ్ర కోసం వేటుకు నేను రెడీ: కిరణ్ రెడ్డి
న్యూఢిల్లీ: కాంగ్రెసు అధిష్టానం తనపై వేటు వేస్తే సమైక్యాంధ్ర కోసం అందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. సిఎన్ఎన్-ఐబియన్ టెలివిజన్ చానెల్కు చెందిన కరణ్ థాపర్కు ఆయన ఇంటర్వూ ఇచ్చారు. ప్రజల ఆకాంక్ష కన్నా రాజీనానామా, అధికారం పెద్దవి కావని ఆయన అన్నారు. ప్రజలు రాష్ట్ర సమైక్యతను కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
పార్టీ అధిష్టానం రాజీనామా చేయాలని అడిగితే మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగితే - వ్యక్తి కన్నా పార్టీ గొప్పదని, అయితే ప్రజానీకం పార్టీకన్నా గొప్పదని, ప్రజల మనోభావాలను గౌరవించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తనకు పదవి ముఖ్యం కాదని అన్నారు. ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదని, తాను 16వ ముఖ్యమంత్రిని అని, 17, 18, లేదా 20వ ముఖ్యమంత్రులు వస్తారని, తాను రాష్ట్ర విభజన జరగకూడదని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.

మీ అంతట మీరు రాజీనామా చేయక ముందే, పదవి నుంచి తప్పుకోవాలని రేపే ఢిల్లీ ఆదేశించవచ్చునని, అది స్వచ్ఛందంగా రాజీనామా చేయడం కన్నా భిన్నమైందని, దాదాపుగా అది డిస్మిస్ చేయడం వంటిదని, దానికి సిద్ధంగా ఉన్నారా అని కరణ్ థాపర్ అడిగారు.
దానికి ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి సమాధానం ఇస్తూ - దేనికైనా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాటం ప్రారంభించినప్పుడే తాను ప్రతిదానికీ సిద్ధపడ్డానని ఆయన అన్నారు. తానేం చేస్తున్నానో తనకు తెలుసునని, తనకు ప్రజల ఆకాంక్ష తెలుసునని, తాను ప్రజల ఆకాంక్షను మాత్రమే వెల్లడిస్తున్నానని, తాను ప్రజలవైపు ఉన్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications