సిఎంనో కాదో, సుప్రీంకు: కాంగ్రెస్ను ఏకిపారేసిన కిరణ్
హైదరాబాద్/చిత్తూరు: తానిప్పుడు నిరుద్యోగినని, ఏం చేయాలో అని ఆలోచిస్తున్నానని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం అన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఇమేజ్ గార్డెన్లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన విశ్వవిద్యాలయ విద్యార్థులతో కిరణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
దొంగచాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను ఆమోదించారని కిరణ్ కాంగ్రెసు పార్టీ అధిష్టానంపై మండిపడ్డారు. అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించుదామని విద్యార్థులతో అన్నారు. తాను ఇప్పుడు నిరుద్యోగినని, ఏం చేయాలో ఆలోచిస్తున్నానని వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును ఎలా పెడతారని ఎన్ని పార్టీలు అడిగినా కాంగ్రెసు పార్టీ అధిష్టానం పట్టించుకోలేదని ఆరోపించారు. సమైక్యమో లేక పార్టీయో తేల్చుకునే పరిస్థితిని తనకు రానీయవద్దని అధిష్టానానికి తాను సూచించానని చెప్పారు. ప్రజాభిష్టాన్ని పట్టించుకోకుండా విభజించినందువల్లే తాను రాజీనామా చేశానని చెప్పారు.
తెలంగాణ ఇవ్వాలి కానీ, ఇంత దారుణమైన బిల్లును తాను చూడలేదని అద్వానీ చెప్పారన్నారు. విభజనతో తెలంగాణ ప్రాంతానికే ఎక్కువ నష్టమన్నారు. రాజధానిని తీసుకొని మనల్ని బయటకు వెళ్లామన్న తర్వాత తెలంగాణ కొత్త రాష్ట్రం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఓట్లు, సీట్ల కోసమే చీకటి ఒప్పందంతో విభజన చేశారన్నారు. సమైక్యాంధ్ర కావాలని చెప్పలేని అసమర్థుడు చంద్రబాబు అన్నారు. జగన్ పార్టీ కూడా విభజనకు సహకరించిందన్నారు.
ఇంత జరిగాక తాను కొత్త పార్టీ పెట్టాలా అని ఆలోచించానన్నారు. ఎవరి కోసం పార్టీ పెట్టాలని ఆలోచించానన్నారు. విభజన చేసింది కాంగ్రెసు పార్టీ అని, దానికి సహకరించింది టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు అని చెప్పారు. తెలుగు వారికి ఇంత మోసం చేశాక కూడా మౌనంగా కూర్చుండి పోవాలా అని ఆలోచించానన్నారు. నేను ముఖ్యమంత్రినో కాదో నాకే తెలియడం లేదన్నారు. బాధ్యతల నుండి తప్పించాలని తాను రెండోసారి కూడా గవర్నర్కు లేఖ రాశానన్నారు. రాజీనామా చేసినా ఆపద్ధర్మ సిఎంగా కొనసాగిస్తున్నారన్నారు.
సమైక్య పోరాటం ఇంకా ఆగలేదన్నారు. పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ పోరాటం మనదన్నారు. చీకటి ఒప్పందం చేసుకొని విభజించినంత మాత్రాన మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదన్నారు. తాను విభజనపై సుప్రీం కోర్టుకు వెళ్తానని చెప్పారు. ఒకరు కేసుల కోసం కేంద్రంతో రాజీపడ్డారని, మరొకరు అధికారం కోసం ఏమైనా చేస్తున్నారని జగన్, చంద్రబాబులను ఉద్దేశించి అన్నారు. ఇంత నీచంగా విభజిస్తున్నా మీకు సిగ్గు, లజ్జ ఉన్నదా అని ప్రశ్నించారు.
ఇంత అన్యాయం చేస్తుంటే తాము మౌనంగా కూర్చోవాలా అన్నారు. కేంద్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందన్నారు. సీమాంధ్రులు సంక్రాంతికి వెళ్తే హైదరాబాద్ ఎడారిగా కనిపిస్తుందని, విభజన తర్వాత పరిస్థితి అలాగే ఉంటుందన్నారు. తనకు కాంగ్రెసు పార్టీ బీఫారం అక్కర్లేదన్నారు. సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానన్నారు. యువత వెంట ఉంటే పోరాటం చేస్తానన్నారు.
చిరంజీవి పదవి కోసం పోటీ పడుతున్నారు
రాష్ట్రం విడిపోయి ప్రజలంతా బాధలో ఉంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓదార్పు యాత్ర చేస్తాననడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమమహేశ్వర రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి కోసం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలు పోటీ పడుతున్నారన్నారు.
తరిమేయండి: పయ్యావుల
విభజనకు కారకులైన వారిని తరిమి కొట్టాలని మరో టిడిపి నేత పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. జైరామ్ రమేష్ తిరుపతిలో అడుగు పెడితే తిరుమల అపవిత్రమవుతుందన్నారు.