రేవంత్ ఇష్యూ, గ్రేటర్ ఎన్నిక: బాబుతో దోస్తీపై బీజేపీ పునరాలోచన, కానీ
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి వ్యవహారంతో ఆ పార్టీతో పొత్తు విషయంలో భారతీయ జనతా పార్టీ పునరాలోచన చేయనుందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. రేవంత్ వ్యవహారంపై తమ పార్టీ అధిష్టానానికి పూర్తి నివేదికను పంపిస్తామని కిషన్ రెడ్డి మంగళవారం చెప్పారు.
ఆ తర్వాత టీడీపీతో పొత్తు విషయాన్ని అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణ బీజేపీ నేతలు మొదటి నుండి టీడీపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా లేరు. అయినప్పటికీ అధిష్టానం మాట మేరకు వారు గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లారు.
తమకు నగరంలో మాత్రమే ఐదు సీట్లు వచ్చాయని, మిగతా జిల్లాల్లో సీట్లు రాకపోవడానికి టీడీపీయే కారణమని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ ఉదంతంతో వారు మరోసారి టీడీపీతో తాము జట్టు కట్టేందుకు సిద్ధంలేమని చెప్పే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ - టీడీపీ జతగా వెళ్తారని మొదటి నుండి ఉన్న విషయమే. అయితే, రేవంత్ వ్యవహారం నేపథ్యంలో టీడీపీతో కలిసి వెళ్తే నష్టమని అధిష్టానానికి చెప్పే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇప్పటికే పలువురు బీజేపీని ప్రశ్నిస్తున్నారు. మోడీ స్వచ్ఛ పాలన అందిస్తానని చెబుతున్నారని, అలాంటప్పుడు అవినీతి మకిలి అంటిన టీడీపీతో ఎలా అంటకాగుతారని తెరాస ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ నేతలు కూడా ప్రధాని మోడీ ఇంకా టీడీపీతో జత కడతారా అని ప్రశ్నిస్తున్నారు.