కిరణ్ను తొలగిస్తేనే సాధారణ పరిస్థితి: తెలంగాణపై కిషోర్
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పైన మండిపడ్డారు. విభజన నిర్ణయం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో సాధారణ పరిస్థితులను తీసుకు వచ్చేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ కమిటీ అధ్యక్షుడిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటన తెలంగాణపై వెనక్కి పోదని చెబుతోందన్నారు. విభజన తర్వాత వచ్చే సమస్యలపై హామీ ఇవ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతి అంశాన్ని పరిశీలిస్తామనే మాటలు చెప్పకుండా తెలంగాణలో సీమాంధ్ర ప్రజలకు భద్రత, యువతకు ఉద్యోగాలు, నిధులు తదితరాల పైన చర్చించాలన్నారు.
తొలుత రాష్ట్ర పరిస్థితులను చక్కదిద్దాలని ఆ తర్వాత విభజన ప్రక్రియ పైన ముందుకు వెళ్లాలన్నారు. మంత్రుల బృందం(జివోఎం) రాష్ట్రంలో పర్యటించాలని తద్వారా ప్రజల అభిప్రాయాలు, సమస్యలు దగ్గరి నుండి తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. హైదరాబాదులో ఐటిఐఆర్ ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని తాను ప్రశ్నించడం లేదని అయితే ఆ నిర్ణయం సరైన సమయంలో తీసుకోలేదని అభిప్రాయపడ్డారు.
కిరణ్, బొత్సలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం పంపించే తెలంగాణ తీర్మానాన్ని ఒడించాక రాజీనామా చేయాలని కిరణ్ ఎమ్మెల్యేలకు సూచించినట్లుగా తెలుస్తోందని, అందుకు వారు రాజీనామా చేయాలన్నారు. బహిరంగ సవాళ్లు సరికాదన్నారు. నాయకత్వాన్ని మార్చితేనే రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్నారు. సాధారణ పరిస్థితులు రావాలంటే మొదట నాయకత్వాన్ని మార్చాలని అభిప్రాయపడ్డారు.
విభజన ద్వారా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెసు పార్టీ అన్ని స్థానాలలో గెలుస్తుందని తాను భావించడం లేదని, అదే సమయంలో విభజన చేయడం ద్వారా కాంగ్రెసు పార్టీకీ ఆంధ్రా ప్రాంతంలో ఎదురుగాలి వీస్తుందని అభిప్రాయపడ్డారు.