గులకరాయితో హత్యా ప్రయత్నం చేస్తారా?
రాష్ట్రంలో ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలికానీ 'షో'లు చేయకూడదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ఇటీవలే విశాఖపట్నంలో నానా హంగామా సృష్టించారని, మరోసారి ఇప్పటం వెళ్లి హంగామా చేశారంటూ మండిపడ్డారు. గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.
కేఏ పాల్ మాదిరిగానే పవన్ కల్యాణ్ కూడా ఇప్పటంలో పరుగులు పెట్టారని, మునుగోడులో కావల్సినంత ఎంటర్ టైన్ మెంట్ తో కేఏ పాల్ రక్తి కట్టిస్తే ఎక్కడ తాను వెనకబడిపోతానో అనే ఉద్దేశంతో పవన్ ఇప్పటం వచ్చారన్నారు. అక్కడ 'షో' అయిపోగానే వెళ్లిపోయారంటూ సెటైర్ వేశారు.
రాష్ట్రంలో సంక్షేమ పాలన జరుగుతుంటే చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్కు నిద్రపట్టడం లేదని, రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఎక్కడున్నాయని కొడాలి ప్రశ్నించారు. లేని సమస్యలను ఇద్దరూ సృష్టిస్తున్నారని, వాళ్ల సమస్యలతోనే ఇద్దరూ సతమతమవుతున్నారని వ్యాఖ్యానించారు.
తాగుబోతులు పవన్ కళ్యాణ్ ఇంటి ముందు హడావుడి చేస్తే రెక్కీ అన్నారని, చంద్రబాబుపై గులకరాయితో హత్యాయత్నం జరిగిందంటూ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొలిటికల్ టూరిస్టులని, హైదరాబాద్లో రెక్కీ జరిగితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏం సంబంధమన్నారు.
రెక్కీ పేరుతో పవన్ కల్యాణ్ గాలి మాటలు మాట్లాడుతున్నారని, జూబ్లీహిల్స్ లో రెక్కీ జరిగితే చంద్రబాబునాయుడికేం సంబంధమని, ఆయన మతి ఉండే మాట్లాడుతున్నారా? అంటూ ధ్వజమెత్తారు. విపక్షాలు నిర్మాణాత్మకంగా ఒక్క సలహా కూడా ఇవ్వలేదని, పవన్ కల్యాణ్ రాజకీయ అజ్ఞాని అన్నారు.