జగన్ తో పెట్టుకుంటే టీడీపీకి రాజకీయ సమాధే: లోకేష్, చంద్రబాబుకు కొడాలి నాని వార్నింగ్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ను ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరోమారు టార్గెట్ చేశారు. జగన్ తో యుద్ధం చేస్తే టీడీపీకి రాజకీయ సమాధే అంటూ కొడాలి నాని హెచ్చరికలు జారీ చేశారు.
మూడు రాజధానులపై లోకేష్ వ్యాఖ్యలకు కొడాలి నాని కౌంటర్
గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కొడాలి నాని టీడీపీ నేత నారా లోకేష్ పై మరోమారు విరుచుకుపడ్డారు. విభజన పార్లమెంటు చట్టం ద్వారా జరిగిందని, మూడు రాజధానులు కావాలంటే పార్లమెంటు సవరణ చేయాలన్న లోకేష్ వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. నారా లోకేష్ కు నాలెడ్జ్ లేదని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో రాజధానిపై ఎప్పుడు చట్టం చేశారని నారా లోకేష్ ను ప్రశ్నించారు.
జిల్లాలపై లోకేష్ వ్యాఖ్యలు సిగ్గు చేటు, చంద్రబాబుకు సిగ్గు లేదా?
175 జిల్లాలు చెయ్యాలని లోకేష్ చెప్పటం సిగ్గుచేటని మంత్రి కొడాలి నాని విమర్శించారు. 175 నియోజక వర్గాల 175 జిల్లాలను చేయమని లోకేష్ అడుగుతున్నాడని మండిపడిన కొడాలి నాని లోకేష్ కి అసలు ఏ నియోజకవర్గం లేదంటూ ఎద్దేవా చేశారు. అప్పట్లో కుప్పం ను డివిజన్ చేయాలని చంద్రబాబుకు ఎందుకు అనిపించలేదో చెప్పాలని కొడాలి నాని ప్రశ్నించారు. ఇప్పుడు సీఎం జగన్ కు ఎలా ఉత్తరాలు రాస్తాడు అంటూ ప్రశ్నించిన కొడాలి నాని కాస్తయినా చంద్రబాబుకు సిగ్గు లేదా అంటూ మండిపడ్డారు.
టిడిపి రాజకీయ భవిష్యత్తుకు జనం సమాధి కడతారు
అభివృద్ధి పనులను అడ్డుకుంటే టిడిపి రాజకీయ భవిష్యత్తుకు జనం సమాధి కడతారని కొడాలి నాని తేల్చిచెప్పారు. వచ్చే ఎన్నికల వరకు ఈ ఫోర్ ట్వంటీ బ్యాచ్ ను భరించక తప్పదు అంటూ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో కమీషన్లకు కక్కుర్తిపడి అడ్డమైన మద్యం బ్రాండ్లను తీసుకువచ్చింది చంద్రబాబేనని కొడాలి నాని ధ్వజమెత్తారు. మద్యం అమ్మకాలను ప్రోత్సహించింది చంద్రబాబేనని పేర్కొన్న ఆయన, మద్యం అమ్మకాల ద్వారా కమిషన్ తీసుకొని ఆస్తులు పెంచుకుంది చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు.
ఏం చెబితే అది నమ్మే ప్రజలు ఉన్నారు అనుకునే 420బ్యాచ్ టీడీపీ
కమీషన్లకు కక్కుర్తి పడి బార్లకు ఐదేళ్లు లైసెన్సులు ఇచ్చారని, గతంలో బార్లకు రెండేళ్ళ వరకు మాత్రమే అనుమతులు ఉండేవని కొడాలి నాని వెల్లడించారు. చేసిందంతా చేసి ఇప్పుడు ఇంట్లో కూర్చొని చంద్రబాబు తనకేమీ తెలియదని మాట్లాడుతున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నేతలు తమ మీడియా ద్వారా అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్న మంత్రి కొడాలి నాని సి బ్రాండ్, ఎల్ బ్రాండ్లకు చంద్రబాబు ఎలా అనుమతిచ్చారో రాష్ట్రమంతా చూసింది అంటూ వ్యాఖ్యానించారు. ఏం చెబితే అది నమ్మే ప్రజలు ఉన్నారు అనుకునే ఫోర్ ట్వంటీ బ్యాచ్ చంద్రబాబు బ్యాచ్ అంటూ కొడాలి నాని మండిపడ్డారు.
చంద్రబాబు ఔరంగజేబు.. ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుదని మండిపడిన కొడాలి నాని, దేనికి పనికి రాని చంద్రబాబుని అల్లుడిని చేసుకుంటే ఔరంగజేబుగా మారాడని ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు అంటూ వ్యాఖ్యలు చేశారు. టిడిపి నేతలు తమ రొటీన్ ప్రసంగాలు ఆపటం లేదని మండిపడిన కొడాలి నాని రాష్ట్రంలో లిక్కర్ బ్రాండ్లు ఎవరు తెచ్చారో ఆధారాలతో సహా నిరూపించామన్నారు. డిస్టిలరీ లకు అనుమతి ఇచ్చింది ఎవరు అంటూ ప్రశ్నించిన కొడాలి నాని బార్ల రద్దుపై కోర్టుకెళ్లి మరి అనుమతులు తెచ్చుకుంటున్నారు అంటూ మండిపడ్డారు.
కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటుకు పేటెంట్ చంద్రబాబుదే
కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటుకు పేటెంట్ హక్కు చంద్రబాబుకే ఉందని కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని నాశనం చేశాడని ఎన్టీఆర్ గతంలోనే చెప్పారని కొడాలి నాని పేర్కొన్నారు. తాము బార్ల అనుమతులను రద్దు చేస్తే 24 గంటల్లో కోర్టుకు వెళ్తున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మద్య నియంత్రణ గురించి ముందే చెప్పారని, అధికారంలోకి రాగానే 45 వేల బెల్టుషాపులను తొలగించారని పేర్కొన్నారు. పర్మిట్ రూములు పూర్తిగా ఎత్తి వేయించారని వెల్లడించారు. మద్య నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు.