కోదండరామ్తో కెసిఆర్ కరచాలనం: మళ్లీ చిగురిస్తుందా?
హైదరాబాద్: టిఎన్జివోల డైరీ ఆవిష్కరణ జరిగిన హైదరాబాదులోని రవీంద్రభారతి మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, తెలంగాణ జెఎసి కోదండరామ్ కలుసుకున్నారు. ఆ కలయిక సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇరువురి మధ్య విభేదాలు చోటు చేసుకోవడంతో దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతూ వస్తోంది. కోదండరామ్ మీద కెసిఆర్ గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. అయితే, కోదండరామ్ ఉండే వేదిక మీదికి కెసిఆర్ కావాలనే వచ్చారా అనే చర్చ కూడా సాగుతోంది. స్నేహాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఒకే వేదిక మీదికి ఇరువురు వచ్చే ఏర్పాటు జరిగినట్లు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒకే వేదికపై కలుసుకోవడం ఇదే మొదటిసారి. కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల తర్వాత ఒకే వేదికపై వీరిద్దరు కలుసుకోవడాన్ని ఉద్యోగులంతా ఆసక్తిగా గమనించారు. వీరిద్దరి స్నేహం తిరిగి చిగురుస్తుందా అనేది వారి ఆసక్తికి కారణంగా కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి కెసిఆరే చొరవ తీసుకొని కోదండరామ్తో మాట్లాడటానికి ప్రయత్నించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి తన ప్రసంగంలో కోదండరామ్ను ప్రస్తావిస్తూ త్వరలోనే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి ప్రజాసంఘాలతో ఏర్పాటు చేయబోయే పెద్దల సంఘాన్ని కోదండరామ్ నేతృత్వంలో ఏర్పాటు చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. వేదిక మీదికి చేరుకోగానే కెసిఆర్ కోదండరామ్తో కకరచాలనం చేసుకున్నారు.
చేస్తున్నది కొంచెమే, చేయాల్సింది చాలా ఉందని, అందరం సమష్టిగా కృషి చేసి బంగారు తెలంగాణ సాధించుకుందామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్సహా జిల్లాకు చెందిన 45 మంది సర్పంచులు, ఐదుమంది జడ్పిటీసి సభ్యులు, ఆరుగురు ఎంపిపిలు, 39మంది ఎంపిటీసిలు కాంగ్రెస్కు రాజీనామా చేసి మంగళవారం టిఆర్ఎస్ భవన్లో కెసిఆర్ సమక్షంలో గులాబి పార్టీలో చేరారు. బాలునాయక్కు కెసిఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బంగారు తెలంగాణ సాధించేందుకు అందరం కంకణం కట్టుకోవాలని అన్నారు. వాటర్ గ్రిడ్ పథకానికి నల్లగొండ జిల్లాలో త్వరలో తానే శంకుస్థాపన చేస్తానన్నారు. మరో రెండున్నరేళ్లు గడిస్తే నిరంతర విద్యుత్ అందజేస్తామని, రెప్పపాటు కూడా కోత లేకుండా విద్యుత్ సరఫరా ఉంటుందని తెలిపారు. మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్రంలోని 46వేల చెరువుల పూడిక తీసి, వాటికి పూర్వవైభవం కల్పించనున్నట్టు చెప్పారు.
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా రోడ్లను అభివృద్ధి పరచనున్నట్టు చెప్పారు. వచ్చే మూడు నాలుగు నెలలపాటు శాసన సభ్యులు ఈ అంశాలపైనే దృష్టిపెట్టాలని అన్నారు. విద్యుత్, మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు చెప్పారు. బాలునాయక్కు గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉందని, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డితోపాటు జిల్లా అభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.