ఇప్పుడేమిటి: షిండేపై విరుచుకుపడ్డ కోదండరామ్
హైదరాబాద్: తెలంగాణపై మళ్లీ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పడంపై తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ మండిపడ్డారు. ఇంత దూరం వచ్చాక మరోసారి సమావేశం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ప్రకటనలవల్ల భయాందోళనలు పెరిగి తెలంగాణ మరిన్ని ఆత్మహత్యలు జరిగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఇక్కడ నిర్వహించిన జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీ తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
మరోసారి అఖిలపక్షమనడం కాలయాపన కోసమేనని, ఇప్పటికే అన్ని పార్టీలూ లిఖితపూర్వకంగా అభిప్రాయం చెప్పాయని, మళ్లీ భేటీ ఎందుకని ఆయన అన్నారు. విభజన ప్రక్రియ ముగింపుదశకు చేరాక అభిప్రాయాలు అడగటమంటే అమరులను అవమానించడమేనని, ఇక జరగాల్సిందల్లా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టడమేనని కోదండరామ్ అన్నారు.
నవంబర్ 1న విద్రోహ దినం పాటిస్తామని ఆయన చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి తెలంగాణలో వరద బాధితుల పరామర్శకు రావడం ప్రజాకాంక్షకు వ్యతిరేకమని అంటూ ఆమెను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
మళ్లీ అఖిలపక్షం పెడతామనడం కుట్రేనని దేవీప్రసాద్ అన్నారు. ఆర్టికల్ 371(డి)పై వివరణ కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానికి లేఖ రాయడం అయోమయం సృష్టించడమేనని చెప్పారు. మంత్రుల బృందానికి రాష్ట్ర ప్రభుత్వం పంపుతున్న ఉద్యోగుల లెక్కలపై తెలంగాణ వారి అభిప్రాయాలు తీసుకోవడం లేదని అంటూ ఈ లెక్కలన్నింటినీ ఇంటర్నెట్లో పెట్టాలని కోరారు. సీమాంధ్ర ఉద్యోగులు రెండునెలల జీతం తీసుకున్నాక మళ్లీ సమ్మె ప్రారంభించే అవకాశాలు ఉన్నాయన్నారు.
మళ్లీ అఖిలపక్షం పేరిట కాలయాపన చేస్తే ప్రజలు మరో పోరాటానికి సిద్ధమని టీజేఏసీ కో-చైర్మన్ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. సీమాంధ్ర నేతలు ఆర్టికల్ 371(డి)పై అక్కడి ప్రజల్లో అనవసర అపోహలు కలిగిస్తున్నారని మరో నేత సి.విఠల్ విమర్శించారు. ఇది విభజనకు ఏమాత్రం అడ్డంకి కాదన్నారు.