జగన్! నాశనమైపోతావు: కోడెల ఫైర్, ‘రంగా హత్య కలచి వేసింది.. అందుకే రాజీనామా’
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ అనర్హుడని అన్నారు. జగన్ విషయమై ఆయన పార్టీకి చెందిన నేతలే ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు.
సోమవారం కోడెల మీడియాతో మాట్లాడుతూ.. వారానికి ఓ రోజు కోర్టు బోనులో నిలబడే జగన్... రాజకీయ విలువల గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. ప్రజలను, ఓ వర్గాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే అది జరగదన్నారు. రాష్ట్రం కోసం ప్రతి రాజకీయ నాయకుడు, పౌరుడు ఆలోచించాలన్నారు.
ప్రతిపక్ష నేతగా గౌరవిస్తుంటే.. జగన్ సభలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వంగవీటి రంగా హత్య నిందితులు అంటూ జగన్.. తన పేరును ప్రస్తావించడంపై కోడెల తీవ్రంగా మండిపడ్డారు. అద్దం ముందు కూర్చుంటే నేరస్తులు ఎవరో జగన్కు కనిపిస్తారని అన్నారు. రంగా తనకు స్నేహితుడు కాదు, శత్రువు కాదని కోడెల అన్నారు.

జగన్ వ్యాఖ్యలు తనను బాధించాయని అన్నారు. జగన్ వ్యాఖ్యలకు బదులు ఇవ్వకుంటే.. అవి నిజమేనని ప్రజలు నమ్ముతారని అన్నారు. తాను హోంమంత్రిగా ఉన్న సమయంలోనే రంగా హత్య జరిగిందని తెలిపారు. రంగా హత్య తర్వాత అల్లర్లు చెలరేగాయని చెప్పారు. రంగా హత్య, అల్లర్లు కలిచివేసినందునే రాజీనామా చేశానని కోడెల తెలిపారు.
కాపు సోదరుల ఆందోళనలో న్యాయముందని కోడెల శివప్రసాదరావు అన్నారు. ప్రతిపక్ష నేత జగన్ రెచ్చగొడితేనే అక్కడ హింస చెలరేగిందని మండిపడ్డారు. జగన్ ప్రోత్సాహంతో రౌడీమూకలు రెచ్చిపోయాయని ఆయన ఆరోపించారు.
ఆందోళనకారుల వాహనాల్లో జగన్ ఫొటోలు ఎందుకున్నాయని ప్రశ్నించారు. జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని కోడెల అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు జగన్ నడుంబిగించారని ఆయన పేర్కొన్నారు. రెండేళ్లలో అధికారంలోకి వస్తానని జగన్ ఎలా అనుకున్నారని.. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు చేసేనా? అని కోడెల ప్రశ్నించారు.
ప్రజలు అనుకుంటున్నదే తాను చెబుతున్నానని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏమైనా పరవాలేదు.. పదవి కావాలనుకునేవారు ఏం నేత అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకో... లేదా సర్వనాశనమైపోతావని కోడెల హెచ్చరించారు. ఘటనపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఆయన కోరారు.
ముద్రగడ సహా 35మందిపై కేసులు: జిల్లా ఎస్పీ
తుని ఘటన నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం సహా 35 మంది పైన కేసులు పెట్టినట్లు జిల్లా ఎస్పీ రవికృష్ణ తెలిపారు. శాంతిభద్రతల కోసమే జిల్లా వ్యాప్తంగా 144వ సెక్షన్ అమలు చేశామన్నారు. జిల్లాలో అదనపు బలగాలను మోహరించామన్నారు.












Click it and Unblock the Notifications