కోడెల కొత్త పాట: నేను ఒక బాధితుడినే.. నాపై జరుగుతుంది కక్ష సాధింపే...
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనపై , తన కుటుంబం పై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై, నమోదు అవుతున్న కేసులపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాద్ తమపై వైసీపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని, అందుకే ఇలా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావాలని వైసీపీ తన కుటుంబాన్ని టార్గెట్ చేసి తన కుమార్తెపై , కుమారుడిపై కేసులు నమోదు చేయించిందని ఆరోపించారు . ఇక పోలీసులు కూడా ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని కోడెల లబోదిబోమంటున్నారు .
స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితో తమపై తప్పుడు కేసులు పెడుతున్నారన్న కోడెల
రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయన్న కోడెల తాను కూడా టీడీపీ కార్యకర్తనేనని , ఒక బాధితుడిని అని ఆవేదన చెందారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మండిపడ్డారు. స్ధానిక ఎమ్మెల్యేల ఒత్తిడితో కొందరు తమ కుటుంబంపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన కోడెల అర్దరాత్రి సోదాలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. పధకం ప్రకారమే తన కుటుంబంపై కేసులు పెడుతున్నారని ఆయన బాధ వ్యక్తం చేశారు .
కుమారికి చెందిన హీరో షో రూమ్ సీజ్ కక్ష సాధింపు చర్యే అన్న కోడెల
తాజాగా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు అమ్మిన అభియోగంపై ఆర్టీఏ అధికారులు శనివారం గుంటూరు నగరంలో కోడెల కుమారుడికి చెందిన హీరో షోరూంను సీజ్ చేశారు. గుంటూరులో తన కుమారుడు శివరాం నిర్వహిస్తున్న హీరో షోరూంను రవాణా శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా సీజ్ చేశారని పేర్కొన్న ఆయన అర్ధరాత్రి పూట తనిఖీలు నిర్వహించడం, వరుస సెలవు దినాల్లో సీజ్ చేయడం రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు. షో రూమ్ సీజ్ చెయ్యటంతో అందులో పని చేసే ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని పేర్కొన్నారు. ఇక ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా షోరూంను సీజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ పనిచేస్తున్న దాదాపు 200 మంది కార్మికుల పరిస్ధితి ఏంటని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.
పోలీసులు రూల్స్ నేర్పుతున్నారని ఆగ్రహం .. ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో కోడెల
ఇక అంతే కాదు కేసుల గురించి పోలీసులను ప్రశ్నిస్తే సమాధానం లేదని ఆయన చెప్పారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తనకు , వివిధ శాఖల్లో మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న తనకుపోలీసులు రూల్స్ గురించి చెప్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఇతర పార్టీల కార్యకర్తలపై ఎన్నడూ దాడులకు పాల్పడలేదని ఆయన పేర్కొన్నారు. కానీ ఇప్పుడు టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ఒకపక్క సొంత పార్టీలోనూ కోడెలకు పొమ్మనకుండా పొగ పెట్టినట్టు నేతల తీరు ఉంది. మరో పక్క అధికార పార్టీ నేతల గురి కూడా ఆయనపైనే ఉంది. దీంతో కోడెల తాజా పరిస్థితులపై ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.