కోడెల కూతురుపై భూ కబ్జా, కిడ్నాప్ అభియోగాలు: విచారణకు కోర్టు ఆదేశం
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కూతురుపై భూ కబ్జా, మోసం, క్రిమినల్, కిడ్నాప్ అభియోగాలు నమోదయ్యాయి. ఈ మేరకు బాధితుల తరపున దాఖలైన పిటిషన్ను సోమవారం విచారించిన స్థానిక కోర్టు.. ఆమెపై వచ్చిన అభియోగాలపై విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది.
కోడెల కూతురు విజయలక్ష్మి, ఆమె సహాయకులపై గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది జి శాంత కుమార్.. పేరేచర్లకు చెందిన కుందూరి శివలక్ష్మి తరపున పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో విజయలక్ష్మి, ఆమె న్యాయవాది ఎం శ్రీనివాస మూర్తిలతోపాటు ఏడుగురిని నిందితులుగా చేర్చారు.
నిందితులపై భూ కబ్జా, మోసం, క్రిమినల్, కిడ్నాప్ అభియోగాలతో కేసు నమోదు చేయాలని పిటిషన్ ద్వారా కోర్టును కోరారు. అక్రమంగా తమకు చెందిన 2.68 ఎకరాల భూమిని విజయలక్ష్మి కబ్జా చేశారని పిటిషన్లో శివలక్ష్మి పిటిషన్లో పేర్కొన్నారు. 14ఏళ్లుగా ఆ భూమి తమ కుటుంబానికి చెందినదేనని వివరించారు.
2001లో ఆ భూమిని తాము కొనుగోలు చేశామని, అయితే గత జులై 22న 150 మందితో వచ్చిన నిందితులు తమపై దాడి చేసి ఇంటిని ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెప్పారు. తమ మూడో కొడుకు అంజిరెడ్డిని జులై 25న నిందితులు కిడ్నాప్ చేశారని, బెదిరింపులకు గురి చేసి తమ ఆస్తిని విజయలక్ష్మి పేరున రాయించుకునేలా భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు.
కాగా, నిందితుల నుంచి తమ కుటుంబసభ్యులు ఎలాంటి డబ్బు తీసుకోలేదని చెప్పారు. రూ. 1.8లక్షల నగదు, 120 గ్రాముల బంగారం, ఇతర విలువైన వస్తువులను నిందితులు తమ ఇంటిపై దాడి చేసి అపహరించారని బాధితురాలు పేర్కొన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. పిటిషన్ విచారించిన కోర్టు విచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది. కాగా, విజయలక్ష్మి గుంటూరులో గైనకాలజిస్టుగా పని చేస్తున్నారు.