విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ పరోక్ష సహకారం : టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న ఆందోళన కొనసాగుతూనే ఉంది. కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టిన కార్మికులు జాతీయ స్థాయిలో ఆందోళనలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు నెలలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేయాలని నిర్ణయించడంతో పాటుగా, పార్లమెంట్ వేదికగా విశాఖ స్టీల్ కర్మాగార ప్రైవేటీకరణ ఆపాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎంపీలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము వ్యతిరేకిస్తున్నామని, కార్మికుల పక్షాన పోరాటం చేస్తామని పార్లమెంటులో కార్మికుల పక్షాన గళాన్ని వినిపిస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పరోక్షంగా సహకరిస్తోంది అంటూ ఆరోపిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు జగన్ కు సామంతులుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తూతూమంత్రంగా తీర్మానం చేసి చేతులు దులుపుకున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి దోచుకున్న దాంట్లో సగం సీఎంకు కప్పం కడుతున్నారని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడం కోసం అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్ సీపీ నేతలు సహకారం అందిస్తున్నారని, పైకి మాత్రం నటిస్తున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications