కొనసాగుతున్న కోనసీమ నిరసన: ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వాహనంపై రాళ్ల దాడి
అమరావతి: కోనసీమ ఇంకా చల్లారలేదు. తాజాగా, బుధవారం సాయంత్రం కోనసీమలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ వాహనంపై కొంతమంది ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. జిల్లాలోని రావులపాలెం రింగ్రోడ్డు వద్ద ఎస్పీ ఐశ్వర్య రస్తోగి కారుపై ఆందోళకారులు రాళ్లు రువ్వారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆందోళనకారులను వెంబడించారు. దీంతో వారు పారిపోయారు.
కోనసీమ సాధన సమితి బుధవారం చలో రావులపాలెంకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున యువకులు నిరసన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అమలాపురం ఘటనను దృష్టిలో పెట్టుకుని ముందుగానే అప్రమత్తమైన పోలీసులు ఎక్కడివారిని అక్కడే అదుపులోకి తీసుకుంటూ కట్టడి చేస్తున్నారు. నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా ఆంక్షలు విధించారు. ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు పట్టణంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
కోనసమీ సాధన సమితి సభ్యులు వినతి పత్రం ఇచ్చేందుకు ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాగా, బందోబస్తులో భాగంగా పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఎస్పీ కారులో వెళ్తుండగా.. రావులపాలెం రింగ్ సెంటర్ వద్ద కొంతమంది యువకులు ఎస్పీ రస్తోగి వాహనంపై రాళ్లు విసిరారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించడంతో పారిపోయారు. దీంతో మరింత అప్రమత్తమైన పోలీసులు నిఘాను పెంచారు. ఎక్కడ దాక్కున్నవారిని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు చెబుతున్నారు.
కోనసీమ అల్లర్లలో 46 మంది అరెస్ట్
ప్రస్తుతం కోనసీమ, అమలాపురంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయన్నారు ఏపీ హోంమంత్రి తానేటి వనిత, అమలాపురం ఘటన, అనంతర పరిస్థితులపై డీజీపీతో సమీక్షించినట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు హోంమంత్రి వనిత ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆందోళనలు జరగకుండా అమలాపురానికి అదనపు బలగాలను పంపామని, అక్కడి పరిస్థితులు ప్రస్తుతం పూర్తిగా అదుపులోనే ఉన్నాయని తెలిపారు.
గతంలో ఏడుకుపైగా కేసులున్న 72 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. వారిలో 46 మందిని అరెస్ట్ చేశామని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లపై దాడి చేసినవారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఆందోళనకారులు దాడి చేస్తున్నా.. సంయమనం పాటించారని పోలీసులను హోంమంత్రి వనిత అభినందించారు. దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.