మక్తల్, దేవరకద్ర: కొత్తకోట దంపతులకు ఎదురీతే
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్తకోట దంపతులకు ఈసారి ఎదురీత తప్పేట్లు లేదు. 2009 ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసిన ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అదే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బి ఫారం పొందిన మక్తల్ ఎమ్మెల్యేగా కొత్తకోట దయాకర్రెడ్డి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
2009 ఎన్నికల్లో చేరో నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ఈ భార్యాభర్తలిద్దరూ మరోసారి బరిలో నిలిచారు. ప్రస్తుత పరిస్థితులు వారికి ఎదురీతలా కనబడుతున్నాయి. దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గానికి మరోసారి టిడిపి తరపున రంగంలోకి దిగిన సీతా దయాకర్ రెడ్డి పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్, తెరాస నువ్వానేనా అనే రీతిలో పోటీ పడుతుండగా, టిడిపికి మాత్రం ఇక్కడ ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీతమ్మ భర్త ఎమ్మెల్యే దయాకర్రెడ్డికి ఈ ఎన్నికలు కష్టంగానే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఉన్నప్పటికినీ ప్రధానంగా కాంగ్రెస్, తెరాసల పోటీ నెలకొనే అవకాశం ఉంది. 2009 ఎన్నికల్లో అనూహ్యంగా స్వల్ప మెజారిటీతో గెలుపొందిన దయాకర్రెడ్డికి ప్రస్తుత ఎన్నికలు అంత సులువుగా కనబడటం లేదు. అయితే ప్రస్తుతం టిడిపి, బిజెపిల మధ్య పొత్తు కుదిరింది. మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపికి దాదాపు 15 నుండి 20వేల ఓటుబ్యాంకు ఉంది. అది టిడిపికి పడితే దయాకర్ రెడ్డి విజయం సాధించవచ్చునని అంటున్నారు. అయితే, బిజెపి నియోజకవర్గ ఇంచార్జి కొండయ్య టికెట్ దక్కకపోవడంతో ఏకంగా పార్టీ సాధారణ సభ్యత్వానికి, క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
దేవరకద్ర నియోజకవర్గంలో బిజెపి పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికినీ సంఘ్ పరివార్ మాత్రం ఈ నియోజకవర్గంలో పటిష్టంగా ఉండటంతో ఆ ఓట్లు సీతమ్మకు మళ్లితే తప్ప గెలుపు అంత సాధ్యం కాదనే మాట వినిపిస్తోంది. కొత్తకోట దంపతులకు బిజెపి ఓట్లు పడితే కొంత ఊరట కలిగించవచ్చు.












Click it and Unblock the Notifications