అప్పుడే చెప్పా: టిడిపి భేటీకి జగన్ పార్టీ ఎంపి గీత
ఎన్నికలు ముగిసిన వెంటనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీలో చేరిన పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి కూడా హాజరయ్యారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఆత్మగౌరవం లేకపోవడం వల్లే పార్టీ నుంచి బయటకు వచ్చానని అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి దూరంగా ఉంటానని తాను గతంలోనే చెప్పానని ఆమె చెప్పారు.
త్వరలో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి బయటికి రాబోతున్నారని గీత చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని ఆమె హితవు పలికారు. తాను తెలుగుదేశంలో ఎప్పుడు వెళ్లేది త్వరలో చెబుతానని గీత తెలిపారు.
సంస్కారం, మర్యాదలేని పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీలో ఎవరు ఏం మాట్లాడుతారో తెలియదని ఆరోపించారు. ఆత్మగౌరవం లేకుండా చాలా మంది పార్టీలో ఉన్నారని, వాళ్లంతా ఏదో ఒక రోజు పార్టీ నుంచి బయటికి వస్తారని ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే ఈ రోజు సమావేశానికి వచ్చానని ఆమె చెప్పారు.