అసంతృప్తి: ధైర్యం చెప్పిన జగన్కి కొత్తపల్లి గీత షాకిస్తారా
విశాఖ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత పార్టీ పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పార్టీలో మహిళలకు గౌరవం లేదని, వారి పట్ట నేతలు వివక్ష చూపుతున్నారని కొత్తపల్లి గీత ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఆమె పార్టీ మారే ఆలోచనలో కూడా ఉందంటున్నారు.
ఇందుకు సంబంధించి ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఆమెను సంప్రదించినప్పుడు.. తాను ఏ పార్టీలో ఉండాలో కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారట! ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు నుంచే కొందరు నేతలు తనపై వివక్ష చూపడం ప్రారంభించారని, వారి వైఖరి వల్ల పోటీ నుంచి విరమించుకోవాలనే ఆలోచన వచ్చిందని, జగన్ ధైర్యం చెప్పడంతో పోటీ చేసి ప్రజల దీవెనలు, దేవుడి ఆశీస్సుల వల్ల ఎంపీగా గెలిచానని చెప్పారట.
నియోజకవర్గ ప్రజలకు మేలు జరిగేలా కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నానని, ఢిల్లీలోనూ, హైదరాబాద్లోనూ అన్నిపార్టీల నేతలు సహకరిస్తున్నారని వివరించారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల పార్టీ నేతలు తనను పార్టీ కార్యక్రమాల్లో కలుపుకొని వెళ్లడం లేదని, కావాలనే దూరంగా ఉంచుతున్నారని గీత ఆరోపిస్తున్నారు.
రాజకీయాల్లో మహిళలు రాణించాలంటే తప్పనిసరిగా ఓ గాడ్ఫాదర్ ఉండాలని, లేదంటే నెగ్గుకు రావడం కష్టమని ఆమె అభిప్రాయపడ్డారు. ఉన్న పళంగా తనకు పార్టీ మారే ఆలోచన లేదని, ఒకవేళ అలా మారాల్సి వస్తే ముందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి, ఆ తర్వాత మళ్లీ పోటీ చేయడానికి ప్రజల వద్దకు వెళ్తానని ఆమె చెబుతున్నారట. స్వయంగా పార్టీ అధ్యక్షుడు జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు రాగా, స్థానిక నేతలు ఆ విషయం కూడా తనకు చెప్పలేదని విమర్శించారు.