కోటయ్య మృతిపై ఆనందయ్య రియాక్షన్-ఎట్టకేలకు కృష్ణపట్నంలోని నివాసానికి-మందుపై కీలక ప్రకటన
కృష్ణపట్నం ఆనందయ్య నాటు మందు పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సోమవారం(మే 31) ఆయన తన నివాసానికి చేరుకున్నారు. పోలీస్ భద్రత నడుమ ఇంటికి చేరుకున్న ఆయనకు స్థానికులు స్వాగతం పలికారు. మందు తయారీకి రెండు,మూడు రోజులు సమయం పడుతుందని ఈ సందర్భంగా ఆనందయ్య తెలిపారు. మందు తయారీకి కావాల్సిన మూలికలు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తయారీ తర్వాత అధికారులతో మాట్లాడి మందు పంపిణీ తేదీ ప్రకటిస్తామన్నారు. మందు పంపిణీకి అనుమతినిచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.
Recommended Video

కోటయ్య మృతిపై ఆనందయ్య రియాక్షన్
ఆనందయ్య వద్ద మందు తీసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం(మే 31) మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆనందయ్య మందు వికటించడం వల్లే ఆయన చనిపోయారని సోషల్ మీడియాలో కొంతమంది ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఆనందయ్య స్పందించారు. కోటయ్య ఈ నెల 16,17 తేదీల్లో తన వద్దకు వచ్చి మందు తీసుకున్నట్లు చెప్పారు. ఆరోజు ఆయన కోలుకుని ఇంటికి వెళ్లాడన్నారు. ఆ తర్వాత ఆయన మళ్లీ ఆస్పత్రిలో చేరాడని... అక్కడ ఏ మందులు తీసుకున్నాడు... ఏ చికిత్స తీసుకున్నాడన్నది తనకు తెలియదన్నారు. ఆ వైద్యం వికటించడం వల్లే ఆయన చనిపోయాడని అన్నారు.

ఆ ప్రచారాన్ని కొట్టిపారేసిన ఆనందయ్య
ఆయుష్ నివేదికలో ఆనందయ్య మందుతో కరోనా తగ్గుతుందనడానికి ఆధారాలు లేవని పేర్కొనడంపై కూడా ఆయన స్పందించారు. తాము మందు ఇచ్చినవారు 2 రోజుల్లో కోలుకుని పాజిటివ్ నుంచి నెగటివ్గా నిర్దారణ అవుతుందన్నారు. ఈ విషయాన్ని తాము నిరూపించగలమన్నారు. ఆనందయ్య మందు వికటించి చాలామంది నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారన్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. 14 రోజుల నుంచి తాను మందు పంపిణీ చేయట్లేదని చెప్పారు. ఇంతలో వేరేవాళ్లు ఆ మందు తయారుచేసి విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. సరైన రీతిలో దాన్ని వారు తయారుచేయకపోవడంతో వికటించి ఉండవచ్చునని అన్నారు.

భవిష్యత్తులో మందుకు గుర్తింపు వస్తుందని...
ఇంటి చుట్టుపక్కల దొరికే చెట్ల మూలికలు,ఇంట్లో వాడే సుగంధ ద్రవ్యాలతోనే తాను మందు తయారుచేస్తున్నానని కోటయ్య తెలిపారు.కరోనాకు మందు తయారుచేసే సంకల్పాన్ని భగవంతుడు తనకు ఇచ్చాడని... దాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని చెప్పారు. భవిష్యత్తులో తాను తయారుచేస్తున్న మందుకు గుర్తింపు వస్తుందన్న నమ్మకం ఉందన్నారు. మరోవైపు అల్లోపతి వైద్యులు మాత్రం... ఆనందయ్య మందును ఆయుష్ ఒక సప్లిమెంట్గా,ఇమ్యూనిటీ బూస్టర్గా మాత్రమే గుర్తించిందని చెబుతున్నారు.ఆయుష్ పరిశోధనల్లో 570 మంది డేటా సేకరిస్తే అందులో ఎక్కువగా నెగటివ్ ఉన్నవారే మందు తీసుకున్నట్లు తేలిందన్నారు. కేవలం 40శాతం మంది పాజిటివ్ పేషెంట్లు మాత్రమే మందు తీసుకున్నారని చెబుతున్నారు.

ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ(సీసీఆర్ఏఎస్) నివేదికను పరిశీలించిన తర్వాత ఏపీ ప్రభుత్వం ఆనందయ్య మందుకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. అయితే కంటిలో వేసే డ్రాప్స్కు మాత్రం ప్రభుత్వం అనుమతినివ్వలేదు. దానిపై ఇంకా పూర్తి నివేదిక రావాల్సి ఉందని తెలిపింది. ఆనందయ్య ఇచ్చే మందులో పీ,ఎల్,ఎఫ్ అనే మందులు వాడొచ్చని స్పష్టం చేసింది. ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభించాక... కోవిడ్ రోగులు ఎవరూ అక్కడికి వెళ్లవద్దని,వారి కుటుంబ సభ్యులు లేదా బంధువులు వెళ్లి మందు తీసుకోవచ్చునని సూచించింది. ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులను పక్కనపెట్టవద్దని ప్రభుత్వం కోరింది. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ.. వ్యక్తిగత ఇష్టానుసారం ఆనందయ్య మందును వాడుకోవచ్చునని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications