విజయవాడా?, కర్నూలా?: సీమకు మళ్లీ: ఎత్తిపోతలపై: ఎల్లుండి కీలక భేటీ: తేలనున్న లెక్కలు
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించుకోవడానికి మరో ముందడుగు పడబోతోంది. కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) శుక్రవారం భేటీ కాబోతోంది. రెండేళ్లుగా కృష్ణా నది నిండుగా ప్రవహించిన నేపథ్యంలో.. నదీ జలాల పంపకాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది. వచ్చే మార్చి వరకూ నదీ జలాల పంపకాలకు సంబంధించిన అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు రానున్నాయి. అలాగే- ఈ బోర్డును ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఈ బోర్డును విజయవాడకు తరలించాలనే ప్రతిపాదన ఉంది.

రాయలసీమ లిఫ్ట్ సహా..
పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి శ్రీశైలం రిజర్వాయర్ మిగులు జలాలను తరలించడానికి ఉద్దేశించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్పై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను వ్యక్తం చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భేటీ ఏర్పాటు కాబోతోంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రారంభ పనులకు అనుమతి ఇఛ్చినప్పటికీ.. కొన్ని కొర్రీలు అలాగే మిగిలిపోయాయి. ఈ ప్రాజెక్ట్పై ముందడుగు వేయాలంటే నీటి వాటాలపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే ఏపీకి బోర్డు తరలింపు, కొత్త, పాత ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై భేటీలో ప్రస్తావనకు వస్తాయి.

తరలింపు ఎక్కడ?
హైదరాబాద్ నుంచి తరలించదలిచిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ప్రస్తుతం మరో కొత్త వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది. సాధారణంగా ఇలాంటి బోర్డులను రాజధానిలో ఏర్పాటు చేస్తుంటారు. దాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే విజయవాడలో దీన్ని నెలకొల్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏపీకి శాశ్వత రాజధాని అంటూ ఏదీ లేదని, దీన్ని కర్నూలులో నెలకొల్పాలనే డిమాండ్ కొద్ది కాలం నుంచి వినిపిస్తోంది. కృష్ణా నది మీద నిర్మించిన రిజర్వాయర్.. శ్రీశైలం ఈ జిల్లాలోనే ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

కర్నూలులో ఏర్పాటుకు
కృష్ణా బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయడం వల్ల రాయలసీమ ప్రాంతానికి ప్రాధాన్యత ఇచ్చినట్టవుతుందనే వాదనలు ఉన్నాయి. విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించినందు వల్ల భవిష్యత్తులో ఈ బోర్డు విజయవాడ నుంచి మళ్లీ తరలి వెళ్లే అవకాశం ఉందని రాయలసీమ వాదులు చెబుతున్నారు. విశాఖపట్నానికి కృష్ణా బోర్డును తరలించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కృష్ణానదీ ముఖద్వారంగా భావించే కర్నూలులోనే దీన్ని నెలకొల్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై జగన్ సర్కార్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందనేది తేలాల్సి ఉంది.
Recommended Video

తేలనున్న లెక్కలు..
వరద ప్రవాహం తగ్గాక వాడుకున్న నీటి లెక్కలు తేల్చి, ఆ తర్వాత అవసరాలను బట్టి కేటాయిస్తామని పేర్కొంది. ప్రస్తుతం నీటి సంవత్సరం ప్రారంభంలోనే నీటి లెక్కలు తేల్చేందుకు బోర్డు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో గత నెల 31వ తేదీ వరకు వినియోగించుకున్న నీటి లెక్కలు, వచ్చే మార్చి 31 వరకు సాగు, మంచినీటి డిమాండ్కు సంబంధించిన వివరాలను వెల్లడించాలంటూ బోర్డు ఇదివరకే లేఖలను రాసింది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్లో నీటి లభ్యత, భవిష్యత్ వినియోగం, వాటాలను దృష్టిలో ఉంచుకుని కేటాయింపులను ఖరారు చేయనుంది బోర్డు.












Click it and Unblock the Notifications