'రఘురామ' ఫ్లెక్సీ రచ్చ... పోలీస్ స్టేషన్ను ముట్టడించిన క్షత్రియ యూత్...
పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులో స్థానిక క్షత్రియ యూత్ పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారన్న ఆగ్రహంతో గుంపుగా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లారు. పోలీసులను పిలిచి ఈ ఘటనపై నిలదీశారు. సమయానికి ఎస్ఐ అందుబాటులో లేకపోవడంతో క్షత్రియ యూత్ సభ్యుడు కుచ్చర్లపాటి లక్ష్మణ్రాజు ఆయనతో ఫోన్లో మాట్లాడారు. తాను వేరే పనిలో ఉన్నందునా బుధవారం(మే 25) ఉదయం పోలీస్ స్టేషన్కు వస్తే మాట్లాడుదామని ఎస్ఐ చెప్పారు. దీంతో క్షత్రియ యూత్ అక్కడి నుంచి వెనుదిరిగినట్లు తెలుస్తోంది.
రఘురామ కృష్ణరాజు,కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతిరాజు ఫోటోలతో స్థానిక క్షత్రియ యూత్ పోడూరు మండలంలోని కొమ్ముచిక్కాలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 'గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస.. గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది.' అనే నినాదంతో దాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీపై అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులు దాన్ని తొలగించేశారు. రఘురామ కృష్ణరాజు అరెస్ట్ అయినప్పటి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రఘురామకు మద్దతుగా ఫ్లెక్సీలు వెలుస్తూనే ఉన్నాయి.
ఏపీ ప్రభుత్వంపై రాజద్రోహం కేసులో అరెస్టయిన ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సికింద్రాబాద్లోని ఆర్మీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. నిజానికి సోమవారమే(మే 24) ఆయన విడుదలవుతారని భావించినప్పటికీ... మరో నాలుగు రోజులు వైద్యం అవసరమని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు గుంటూరు జిల్లా మెజిస్ట్రేట్కు తెలిపారు. ఎంపీ ఆరోగ్యం కుదుటపడ్డాక డిశ్చార్జి సమ్మరీతో కలిపి బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని రఘురామకృష్ణ తరపు న్యాయవాది లక్ష్మీనారాయణను మెజిస్ట్రే ట్ ఆదేశించారు. దీంతో వైద్యుల తుది నివేదిక తర్వాతే రఘురామ విడుదలయ్యే అవకాశం ఉంది.