సంతాప సభలు అంటూ కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ లేఖ
హైదరాబాద్: తెలంగాణాలో రైతు ఆత్మహత్యలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తీరుపై తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు కాంగ్రెస్ పార్టీకి ఐదు పేజీల బహిరంగ ఒక లేఖ రాశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెసు నేతలపై మండిపడ్డారు. హత్యలు చేసినవారే చివరికి సంతాప సభలు పెట్టినట్లుందని ఆయన విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అదే పనిగా విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
రైతు ఆత్మహత్యలపై కాంగ్రెస్ నేతల మాటలు విడ్డూరంగా ఉన్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. అక్రమ హంద్రీ నీవాకు హారతి పట్టింది డీకే అరుణ కాదా అని ఆయన ఆ లేఖలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. తప్పులు చేసింది మీరేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటీఆర్ తెలంగాణ నాయకులకు 5 పేజీల బహిరంగ లేఖ రాయడానికి గల కారణం సోమవారం మహబూబ్ నగర్లో ధర్నా చేపట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్ధాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
ఈ ధర్నాలో విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు, చేసిన అప్పులు కళ్ల ముందు కనిపిస్తుంటే దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఓదార్చే సమయం కూడా ఆయనకు, ఆయన ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. కేసీఆర్కు రైతుల ఉసురు తగులుతుందని శపించారు. రాష్ట్రంలో 323 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, కేసీఆర్ సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డా, ముదనష్టపు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
2004కు ముందు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో రైతులు ఆందోళనలు చేస్తే కేసులు పెట్టారని, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అదే పని చేస్తోందని, చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్కు పడుతుందని పొన్నాల లక్ష్మయ్య సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు.