సీఎం జగన్ తో సోదర బంధం - ఆయన నాయకత్వంలోనే : తన వ్యాఖ్యలపై కేటీఆర్ వివరణ..!!
తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. పలువురు ఏపీ మంత్రులు, నేతలు కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. అదే సమయంలో కేటీఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తూ తెలంగాణ మంత్రు లు కొందరు.. పార్టీ ఎంపీలు సైతం వ్యాఖ్యలు చేసారు. దీంతో..ఇది రాజకీయ దుమారంగా మారింది. ఈ వ్యవహారం మరింత ముదురుతున్న సమయంలో కేటీఆర్ ఒక ట్వీట్ చేసారు. అందులో తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేసారు. హైదరాబాద్ లో జరిగిన క్రెడాయ్ సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.
కేటీఆర్ వ్యాఖ్యలతో దుమారం
కేటీఆర్ నేరుగా ఏపీ పేరు ప్రస్తావించకపోయినా..పక్క రాష్ట్రం అంటూ అక్కడ పరిస్థితుల గురించి ప్రస్తావించారు. అక్కడ కరెంట్ లేదు..నీళ్లు లేవు..రోడ్ల పరిస్థితి బాగోలేదు అని చెబుతూ ఇదంతా సంక్రాంతి సమయంలో సొంత గ్రామానికి వెళ్లిన తన మిత్రుడు ఫోన్ చేసి చెప్పాడంటూ కేటీఆర్ వివరించారు. తాను తిరిగి హైదరాబాద్ వచ్చాకే ఊపిరి పీల్చుకున్నట్లు ఉందంటూ తన మిత్రుడు తనతో చెప్పాడని కేటీఆర్ చెప్పుకొచ్చారు. మన ప్రభుత్వం విలువ, అభివృద్ధి తెలి యాలంటే పక్క రాష్ట్రాలకు పంపించాలని ఆ స్నేహితుడు సూచించాడని కేటీఆర్ చెప్పారు.
సీరియస్ గా స్పందించిన ఏపీ మంత్రులు
తాను చెప్పేది అతిశయోక్తిగా అనిపించినా లేదా డబ్బా కొడుతున్నానని అనుకుంటే మీరూ ఒక కారు వేసుకొని వెళ్లి చూసిరండని మంత్రి సూచించారు. ఇక, దీంతో..ఏపీ మంత్రులు వరుసగా మీడియా ముందుకు వచ్చారు. కేటీఆర్ వ్యాఖ్యలను తప్పు బట్టారు. హైదరాబాద్ పురోగతిలో ఆంధ్ర ప్రాంత వాసుల కష్టం కూడా ఉందంటూ వ్యాఖ్యలు చేసారు. ఏపీలో అభివృద్ధి ప్రత్యక్షంగా చూడాలంటూ కేటీఆర్ ను ఏపీకి ఆహ్వానించారు. ఏపీ మంత్రి బొత్సా తెలంగాణలో విద్యుత్ అంశం పై మాట్లాడగా.. మరో మంత్రి రోజా.. కేటీఆర్ ఏపీకి వస్తే తానే మొత్తం రాష్ట్రం తిప్పి చూపిస్తానని చెప్పుకొచ్చారు.
దురుద్దేశం లేదన్న కేటీఆర్
కేటీఆర్ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేసారు. ఇలా..పెద్ద ఎత్తున చర్చలు..వ్యాఖ్యలు కొనసాగుతున్న సమయంలో రాత్రి పొద్దుపోయిన తరువాత మంత్రి కేటీఆర్ ఒక ట్వీట్ చేసారు. అందులో..తాను అన్యాపదేశంగానే మాట్లాడనని..తన వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేసారు. తాను చేసిన వ్యాఖ్యలు ఏపీలోని తన స్నేహితులకు బాధ కలిగించినట్టుందని పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ ను తాను సోదర సమానుడిగా అనుబంధాన్ని ఆస్వాదిస్తానని పేర్కొన్నారు.
జగన్ తో బంధం.. నాయకత్వం పైనా
ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నానని కేటీఆర్ తన ట్వీట్ లో స్పష్టం చేసారు. దీంతో..ఈ వివాదం ముగుస్తుందని భావిస్తున్నారు. ఇక, కేటీఆర్ ఏపీ సీఎం జగన్ తో తన సోదర బంధం తో పాటుగా ఆయన నాయకత్వంలోనే ఏపీ పురోగమించాలని కోరుకుంటున్నట్లు స్పష్టత ఇవ్వటంతో..వైసీపీ నేతలు సైతం దీని మీద ఇక తమ రియాక్షన్లకు ముగింపు చెప్పే అవకాశం కనిపిస్తోంది.