బాబుకు జ్ఞానోదయం కాలేదు, పచ్చపార్టీని తరిమికొట్టాలి: కెటిఆర్
నల్లగొండ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఇంకా జ్ఞానోదయం కాలేదని తెలంగాణ ఐటి మంత్రి కెటి రామారావు వ్యాఖ్యానించారు. తెలంగాణ నుంచి పరిపాలిస్తుంటే ఇతర దేశం నుంచి పాలిస్తున్నట్లుగా ఉందన్న చంద్రబాబు పచ్చపార్టీని ఇక్కడి నుంచి తరిమికొట్టాలన్నారు. తెలంగాణలో ఇంటి పార్టీ ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో సమాజమంతా సీఎం కేసీఆర్ వైపు ఉన్నట్లుగానే బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా మనమంతా కేసీఆర్ వెంట నడవాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండేందుకే సీఎం కేసీఆర్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడిన సీఎం కేసీఆర్పైనే కేసులు పెడతారా అని మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలను ప్రశ్నించారు. నల్గొండ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తున్నందుకు సీఎం కేసీఆర్పై కేసులు పెడ్తారా అని అడిగారు. అధికారం కోల్పోయిన కాంగ్రెస్ నేతలు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు చెత్తబుట్టలో వేశారని ఎద్దెవా చేశారు.

తెలంగాణ ఉద్యమ సత్తా చాటిన గడ్డ ఏదంటే అది నకిరేకల్ మాత్రమే అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్యమంలో నకిరేకల్ ఘనమైన పాత్ర పోషించిందని గుర్తుం చేశారు. నకిరేకల్ ప్రజలు కోరిన డ్రయినేజ్ మంజూరు చేస్తామని ప్రకటించారు. రాష్ర్టానికి విద్యుత్ వెలుగులు అందించే జిల్లాగా నల్లగొండ మారబోతోందని తెలిపారు. దామరచెర్లలో అతిపెద్ద పవర్ప్లాంట్ నిర్మిస్తామన్నారు.
జిల్లాలో ఫ్లోరైడ్ కష్టాలు తొలగించాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారని చెప్పారు. జిల్లా ప్రజల దాహనం తీర్చే నక్కలగండి పథకానికి కేసీఆర్ అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు. ఉద్యమంలో దొంగల్లాగా ఉన్నవారు.. ఇవాళ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో పాలన సరిగా జరగలేదని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, టీడీపీ విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. తమది పేదల ప్రభుత్వమని తేల్చిచెప్పారు.












Click it and Unblock the Notifications