బాబు పిలుపు: 5 లక్షలిచ్చిన కుప్పం తమ్ముళ్లు, కలుస్తా: లేఖపై చిరంజీవి సంతకం
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన సొంత నియోజకవర్గం టిడిపి కార్యకర్తలు రాజధానికి విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
రాజధాని నిర్మాణంలో ఏపీలోని ఐదు కోట్ల మందిని భాగస్వాములను చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికే అమరావతి నిర్మాణం కోసం విరాళాల సేకరణకు ప్రభుత్వం 'ప్రతి ఒక్కరు ఓ ఇటుక పేరిట' ఏపీ సర్కారు ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ ప్రారంభించింది.
దీనికి విరాళాలు ప్రారంభమయ్యాయి. తాజాగా మంగళవారం నాడు తన సొంత నియోజకవర్గానికి వెళ్లిన చంద్రబాబుకు అక్కడి టీడీపీ నాయకులు తమవంతుగా రూ.5.05 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇప్పటికే పలు సంస్థలు పెద్ద మొత్తంలో ఇటుకలను ఇస్తున్నాయి కూడా.
మోడీకి లేఖ: చిరంజీవి సంతకం
అమరావతి నగర శంకుస్థాపన పర్యటన నిమిత్తం ఏపీకి వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ ఎంపీలు లేఖ రాసిన విషయం తెలిసిందే. రాజ్యసభ ఎంపీ జేడీ శీలం లేఖ రాసినట్లు చెప్పారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీలు అందరూ సంతకాలు చేశారు.
రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు తెలియజేసేందుకు వీలుగా తమకు 5 నిమిషాలు అపాయింటుమెంట్ ఇవ్వాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు చిరంజీవి, కేవీపీ రామచంద్ర రావు, శీలం తదితరులు లేఖ రాశారు. వీరితో పాటు టిఎస్సార్, జైరాం రమేశ్ తదితరులు ఈ లేఖ పైన సంతకాలు చేశారు.
ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలు, ప్రత్యేక హోదాపై అప్పటి ప్రభుత్వం చేసిన తీర్మానం అమలైతే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ ఆర్థిక వృద్ధిలో పయనించే అవకాశం ఏర్పడుతుందన్నారు.
గతంలో తిరుపతి, విశాఖపట్నం పర్యటన సందర్భంగా గతంలో ప్రధాని మోడీ చేసిన హామీలను గుర్తు చేశారు. శంకుస్థాపన సమయంలో ప్రత్యేక హోదాపై, ప్యాకేజీపై మోడీ ప్రకటన చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.