సంక్రాంతి కానుకగా 10న మరో కొత్త పథకం: నంద్యాలలో జనం మధ్య ప్రారంభించనున్న వైఎస్ జగన్
కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన జిల్లాల పర్యటనను కొనసాగిస్తోన్నారు. తన పుట్టినరోజైన డిసెంబర్ 21వ తేదీ నాడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకుతో జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. దశలవారీగా దాన్ని కొనసాగిస్తోన్నారు. ఇదివరకు కడప, గుంటూరు జిల్లాల్లో పర్యటించారు. తాజాగా ఆయన కర్నూలు జిల్లాకు వెళ్లనున్నారు. ఈ నెల 10వ తేదీన నంద్యాలలో పర్యటించనున్నారు వైఎస్ జగన్. బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

ఈబీసీ మహిళల కోసం కొత్త పథకం..
ఆర్థికంగా వెనుకబడిన తరగతి మహిళల కోసం కొత్తగా రూపొందించిన పథకాన్ని వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈబీసీ నేస్తం పేరుతో ఈ పథకానికి రూపకల్పన చేసింది ప్రభుత్వం. సంక్రాంతి కానుకగా దీన్ని వైఎస్ జగన్ దీన్ని అందుబాటులోకి తీసుకుని రానున్నారు. నంద్యాలలో నిర్వహించే బహిరంగ సభలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అర్హతలు ఇవే..
ఈ పథకం కింద అగ్రవర్ణాల్లోని నిరుపేద మహిళలకు మూడు సంవత్సరాల వ్యవధిలో 45 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది జగన్ సర్కార్. అగ్రవర్ణ కులాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు ఈబీసీ నేస్తం పథకానికి అర్హులు. లబ్ధిదారులకు సంవత్సరానికి 15 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. మూడు సంవత్సరాల వ్యవధిలో 45 వేల రూపాయల మొత్తాన్ని వారి ఖాతాల్లోకి బదిలీ చేస్తుంది.

ఇప్పటికే ప్రభుత్వ పథకాన్ని అందుకునే కుటుంబాలు మినహాయింపు..
వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తంలో ఉన్న లబ్ధిదారులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలు ఈ పథకానికి అనర్హులు. అగ్ర కులాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన మహిళలను మాత్రమే ఈ పథకానికి అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం. ఈ పథకం కింద నగదు మొత్తాన్ని పొందే లబ్ధిదారుల పేరుతో ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అర్హత ఉండీ తొలిదశలో ఆర్థిక సహాయాన్ని పొందలేని వారికోసం మరో అవకాశం ఇస్తామని ప్రభుత్వం ఇదివరకే పేర్కొంది.

వార్షిక ఆదాయ పరిమితులివే..
అగ్రవర్ణ పేద కుటుంబాలను గుర్తించడానికి వార్షిక కుటుంబ ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకుంది. గ్రామాల్లో ప్రతి నెలా 10 వేల రూపాయలు, పట్టణాల్లో 12 వేల రూపాయల లోపు ఆదాయం ఉన్న అగ్ర వర్ణ పేద కుటుంబాలను ఈ పథకం కిందికి చేర్చింది. ఈ నెలవారీ ఆదాయ పరిమితిని మించని కుటుంబాలకు ఈబీసీ నేస్తం కింద ఆర్థిక సహాయం చేస్తుంది జగన్ సర్కార్. లబ్ధిదారులకు మాగాణి భూమి మూడు ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి.

భూములు ఉంటే..
మెట్ట భూమి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి. మాగాణి, మెట్ట భూమి రెండు కలిపి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి. కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి గాని, ప్రభుత్వ ఉద్యోగం విరమణ చేసిన తరువాత అందే పింఛన్దారులు గానీ ఉండకూడదు. ఈ నిబంధనలో పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా కారు ఉండకూడదు. ఎవరూ ఆదాయపు పన్ను పరిధిలో ఉండకూడదు.












Click it and Unblock the Notifications