మృతదేహాన్ని తీసుకెళ్లమని కర్నూలు జీజీహెచ్ నుంచి ఫోన్.. వెళ్లి చూస్తే షాక్.. కుటుంబం కన్నీరుమున్నీరు.
కర్నూలు జీజీహెచ్ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. కరోనా పాజిటివ్గా తేలిన వ్యక్తి మృతదేహానికి బదులు నెగటివ్గా తేలిన వ్యక్తి మృతదేహాన్ని ఖననం చేశారు. పేర్లను సరిగా పరిశీలించకుండా హడావుడిగా వ్యవహరించడం వల్లే ఈ తప్పిదం జరిగినట్టు తెలుస్తోంది. విషయం తెలిసిన ఆ మృతుడి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
అసలేం జరిగింది..
కర్నూలు జిల్లా బుధవారపేటకు చెందిన రాంబాబు కొద్దిరోజుల క్రితం ఆయాసంతో జీజీహెచ్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 9న అతను మృతి చెందాడు. చనిపోయిన తర్వాత మృతదేహం నుంచి శాంపిల్స్ సేకరించి కరోనా పరీక్షలకు పంపించారు. మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. సోమవారం(మే 11) మెడికల్ రిపోర్టులు రాగా.. అందులో రాంబాబుకు కరోనా నెగటివ్గా తేలింది.
షాక్ తిన్న కుటుంబ సభ్యులు
రాంబాబు మృతదేహానికి కరోనా నెటివ్గా తేలడంతో వైద్య సిబ్బంది అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు జీజీహెచ్లోని మార్చురీకి వెళ్లి మృతదేహం గురించి ఆరా తీశారు. అయితే అప్పటికే రాంబాబుకు అంత్యక్రియలు కూడా నిర్వహించారని తెలిసి షాక్ తిన్నారు. కరోనా పాజిటివ్గా తేలిన మరో వ్యక్తి మృతదేహానికి నిర్వహించాల్సిన అంత్యక్రియలు తమవాడి మృతదేహానికి నిర్వహించారని తెలుసుకున్నారు.
తీరని అన్యాయం జరిగిందని రోదిస్తున్న కుటుంబం..
జీజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యంపై రాంబాబు కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమవాడి మృతదేహాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. అయితే ఆ మృతదేహాన్ని కరోనా పాజిటివ్ వ్యక్తిగా భావించి.. అక్కడి సిబ్బంది దాదాపు 10 అడుగుల లోతులో పూడ్చి పెట్టి ఖననం చేశారు. ఇప్పుడు ఆ మృతదేహాన్ని బయటకు తీసినా.. ముఖం చూసుకునే వీలుంటుందా లేదా అనేది అనుమానమే. జీజీహెచ్ సిబ్బంది తప్పిదంతో తమకు తీరని అన్యాయం జరిగిందని రాంబాబు కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండ్ స్పందించాల్సి ఉంది.
Recommended Video
తప్పిదం ఎలా జరిగింది..
రాంబాబు మృతదేహాన్ని భద్రపరిచిన మార్చురీలోనే ఓ కరోనా పాజిటివ్ వ్యక్తి మృతదేహాన్ని భద్రపరిచారు. వీరిద్దరి పేర్లు కాస్త దగ్గరగానే ఉన్నాయి. అక్కడి సిబ్బంది పేర్ల విషయంలో కాస్త గందరగోళానికి గురై.. ఒక మృతదేహానికి చేయాల్సి అంత్యక్రియలు మరో మృతదేహానికి జరిపించారు. ఏదేమైనా ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఆసుపత్రి సిబ్బందిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా,రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలులో ఇప్పటివరకూ 584 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 284 మంది డిశ్చార్జి అవగా.. మరో 284 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకూ 16 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు.