పంద్రాగస్టుకు కర్నూలు ముస్తాబు, కవాతు (పిక్చర్స్)
కర్నూలు: రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి కర్నూలు జిల్లాలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. మరో 24 గంటల్లో ఉత్సవాలు నిర్వహించాల్సి ఉండటంతో డిజిపి జెవి రాముడు కర్నూలులో మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా నిర్వహించే కవాతులో ఎలాంటి అపశృతులు దొర్లకుండా బుధవారం భద్రతా బలగాలు కర్నూలులోని ఎపిఎస్పీ మైదానంలో నమూనా కవాతు నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలులో జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు.
వేడుకల్లో ప్రదర్శించేందుకు ప్రభుత్వ శాఖల శకటాలు సిద్ధమయ్యాయి. విద్యార్థులు మైదానంలో నమూనా ప్రదర్శన నిర్వహించారు. పంద్రాగస్టు వేడుకలను చిత్రీకరించి ప్రజల ముందుంచేందుకు భారీ క్రేన్ను సైతం పరీక్షించారు. నగరంలో చారిత్రాత్మక కట్టడాలు కొండారెడ్డి బురుజు, గోల్గుమ్మజ్ను విద్యుద్దీపాలతో అలంకరించారు.
కర్నూలు ముస్తాబు
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కర్నూలు ముస్తాబైంది. వేడుకలకు సంబంధించిన రిహార్సల్స్ కూడా చేశారు.
ప్రభుత్వ సంస్థలు ముస్తాబు
కలెక్టరేట్, ప్రభుత్వ ఆసుపత్రులను సైతం సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. నగరంలోని ప్రధాన రహదారులకు పూర్తిస్థాయి మరమ్మతులు చేశారు. రహదారుల మధ్యలో ఉన్న డివైడర్లలో పచ్చదనాన్ని నింపేలా చెట్లు నాటారు. రహదారుల మధ్యలోనే కాకుండా, పక్కన ఉన్న గోడలపై సైతం అందమైన చిత్రాలు వేశారు.
రక్షణ చర్యలు పటిష్టం
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎలాంటి విఘాతం కలుగకుండా పోలీసులు పూర్తిస్థాయి రక్షణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్టస్థ్రాయి పోలీసులతో పాటు ఇద్దరు ఎస్పీలు శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.
ప్రముఖులకు ఏర్పాట్లు...
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సుమారు 450 మంది ప్రముఖులు విచ్చేస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు.
రాత్రికే చంద్రబాబు..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా సుమారు 170 మంది ప్రముఖులు 14వ తేదీ రాత్రికి కర్నూలు చేరుకోనున్నారు. వీరి కోసం నగరంలో నక్షత్ర స్థాయి హోటళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
ముమ్మరంగా తనిఖీలు..
కర్నూలు నగరంలో పెద్ద యెత్తున పోలీసుల బలగాలను దింపారు. ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు