కెవిపి బిల్లు-జగన్ ఎఫెక్ట్: అవునంటూ.. చేతులు దులిపేసుకున్న బాబు!
న్యూఢిల్లీ/విజయవాడ: కేంద్రంలో, ఏపీలో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ - టీడీపీ మధ్య దూరం పెరుగుతోందా? అంటే అలాగే కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు ప్రవేశ పెట్టిన బిల్లు ద్వారా ఇది మరోసారి తేటతెల్లమయిందని చెబుతున్నారు.
గురువారం నాడు కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు, శుక్రవారం నాడు టిడిపి నేతలు, రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ల వ్యాఖ్యలు చూస్తుంటే.. పరోక్షంగా, ప్రత్యక్షంగా ఒకరి పైన మరొకరు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు కనిపిస్తున్నాయన్నారు.
రాజ్యసభలో హోదా: వెంకయ్యపై సీఎం అసహనం, పోరాడి ఓడామని సుజనవెంకయ్య ముందు రోజు మాట్లాడుతూ.. విభజన నేపథ్యంలో తాము ఏపీకి సహకరిస్తున్నామని, చేయాల్సిన దాని కంటే ఎక్కువే చేస్తున్నామని చెప్పారు. అయితే, ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు.
దీనిపై శుక్రవారం నాడు సీఎం రమేష్ తన అసంతృప్తిని వెళ్లగక్కారు. వెంకయ్య వ్యాఖ్యలు తమను అసంతృప్తికి గురి చేశాయని చెప్పారు. అనంతరం సుజన మాట్లాడుతూ.. కేంద్రం ఏపీకి చేస్తున్న సాయం పైన సంతృప్తి వ్యక్తం చేస్తూనే, తమ ప్రభుత్వం పైన ప్రత్యేక హోదా అపవాదు పడకూడదని అభిప్రాయపడ్డారు.
ఈ విషయాన్ని ఆయన సూటిగానే చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో తమ ప్రభుత్వం బ్లేమ్ కావొద్దని, కాబట్టి తనకు మరింత మాట్లాడేందుకు వివరణ ఇవ్వాలని సుజనా పదేపదే డిప్యూటీ చైర్మన్కు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, విభజనకు కాంగ్రెస్, బీజేపీలే కారణమన్నారు. తద్వారా విభజన అపవాదు, విభజన హామీల అపవాదు తమ పైకి రాకుండా ప్రయత్నాలు చేశారని అంటున్నారు.
ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు టిడిపిని, బిజెపిని దుయ్యబడుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు కేంద్రంలోని తన మంత్రులచే రాజీనామా చేయిస్తానని కేంద్రానికి అల్టిమేటం జారీ చేస్తే హోదా వస్తుందని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుజనా తమ ప్రభుత్వం బ్లేమ్ కావొద్దనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా చెప్పవచ్చు.