బాధేస్తోంది, బాబు మిమ్మల్నే తప్పుదోవ పట్టిస్తారా?: స్పీకర్కు కేవీపీ లేఖ
Recommended Video
అమరావతి/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు రెండు శాతమే జరిగాయని వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు ఏపీ సభాపతి కోడెల శివప్రసాద్కు లేఖ రాశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. దాదాపు మూడువేల మంది రైతులను తీసుకొని అట్టహాసంగా పోలవరం సందర్శన యాత్ర చేసి పోలవరం ప్రాముఖ్యాన్ని తెలిసేలా చేసినందుకు అభినందనలు అన్నారు.
కానీ పోలవరం సందర్శన తర్వాత చేసిన వ్యాఖ్యలు సరికాదని కోడెలకు చెప్పారు. 1941 నుంచి 2014 వరకు కేవలం రెండు శాతమే జరిగిందని, అప్పటి నుంచి ప్రస్తుత సీఎం చంద్రబాబు కార్యదక్షత, చొరవ వల్ల ప్రాజెక్టును ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రిగారికి అప్పగించగానే ప్రాజెక్టు 56 శాతం పూర్తయిందని మీరు చెప్పారని, స్పీకర్గా ఉన్న మీరు ఇలా జాతిని తప్పుదోవ పట్టించవచ్చునా అని కోడెలను ప్రశ్నించారు. ఇలా చేస్తారని కలలో కూడా అనుకోలేదన్నారు.
మీ మాటలను అలా భావిస్తున్నాం
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు అడ్డు తగిలారని కేవీపీ అన్నారు. 2004 - 09 మధ్య అన్ని అనుమతనులను కాంగ్రెస్ పార్టీ సాధించిందన్నారు. కుడి, ఎడమ కాలువలు కూడా తవ్విందన్నారు. కాంగ్రెస్ పార్టీకి పేరొస్తుందని అప్పట్లో కొందరు కోర్టులకు వెళ్లి పనులు ఆపేలా చేశారన్నారు. పోలవరం గురించి మీకు ప్రభుత్వం అందించిన సమాచారాన్ని, పోలవరాన్ని చూసి మీరు పులకించిపోయి ఉన్న దశలో మీకు ఇవ్వడం వల్ల, ఆ సమాచారాన్ని ధ్రువీకరించుకునే సమయంలేక దానిలో సత్యాసత్యాలను గ్రహించలేక, ప్రజలకు ఈ విధంగా చెప్పారని భావించాల్సి వస్తోందన్నారు.
మీకే చంద్రబాబు తప్పుడు సమాచారం ఇస్తే
చంద్రబాబుకు ప్రజలు అయిదేళ్లకు ఓసారి మాత్రమే గుర్తుకు వస్తారని కేవీపీ అభిప్రాయపడ్డారు. అందుకే వారిని మాయ చేయడానికి తప్పుడు లెక్కలు చెబుతుంటారన్నారు. గౌరవనీయమైన, ఉన్నతమైన స్థానంలో ఉన్న మీకే (కోడెల) ఇలా తప్పుడు సమాచారం ఇస్తే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటో విజ్ఞులైన మీకు అర్థమవుతుందని భావిస్తున్నామన్నారు. పోలవరం విషయంలో ప్రభుత్వం ఇచ్చిన సమాచారం పక్కనబెడితే వాస్తవమైన సమాచారాన్ని మీకు ఇవ్వడం ఒక ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని కేవీపీ అన్నారు. ప్రజలను, మిత్రపక్షాలను, ప్రతిపక్షాలను తప్పుడు లెక్కలతో మాయ చేసినట్లు స్పీకర్కు కూడా తప్పుడు సమాచారం ఇచ్చి జాతిని తప్పుదోవ పట్టించేలా ప్రసంగం చేయించారన్నారు.
మిమ్మల్ని తప్పుదోవ పట్టించడమే
తద్వారా మిమ్మల్ని దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించడం, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మిమ్మల్ని కూడా స్వార్థ రాజకీయాలకు పావుగా వాడుకోవాలనుకోవడం చాలా బాధ కలిగిస్తోందని కోడెలను ఉద్దేశించి కేవీపీ అన్నారు. 1941లో ప్రాజెక్టు భావన కార్యరూపం దాల్చినప్పటి నుంచి 2014 వరకు ఈ ప్రాజెక్టులో కేవలం 2% పని మాత్రమే పూర్తి అయిందని చెప్పడం ప్రభుత్వం బాధ్యతా రాహిత్యం, ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని తప్పుదోవ పట్టించడమే అన్నారు. స్పీకర్ను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారన్నారు.
కేంద్రం లెక్కలు సరిగా చెప్పడం లేదని
కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు సరిగా చెప్పడం లేదని, వివిధ పథకాల నిధులతో చేపడుతున్న కార్యక్రమాలను తన పేరుతో ప్రచారం చేసుకొంటూ కేవలం ఎన్నికలలో లబ్ధి కోసం తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, కేంద్రంలో అధికారంలో ఉన్నవారు చంద్రబాబుపై పదేపదే ఆరోపణలు చేస్తున్నారని కేవీపీ గుర్తు చేశారు.