వెంకయ్యపై విసుర్లు: ఎపికి ప్రత్యేక హోదా కోరుతూ కెవిపి ప్రైవేట్ బిల్లు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఆయన ప్రస్తావించారు.
తెలుగు రాష్ర్టాలకు సంబంధించిన అంశాలను పలువురు ఎంపీలు రాజ్యసభలో ప్రస్తావించారు. రాష్ట్ర విభజన సమయంలో ఆనాడు సభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు గుర్తు చేశారు. విభన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు కావడంలేదని విమర్శించారు.
వీటిపై దృష్టి పెట్టకుండా కేవలం మాటలతో కేంద్రం వెల్లదీస్తుందని కేవీపీ ఆరోపించారు. ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలని ఆనాడు రాజ్యసభలో వెంకయ్యనాయుడు ఎంతో డిమాండ్ చేశారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయం మరిచిపోయాని ఆయన అన్నారు.
కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రెవేట్ మెంబర్ బిల్లును తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ సమర్థించారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించడంతోపాటు కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. తెలుగు రాష్ర్టాల ప్రజలు సహృద్భావ వాతావరణంలో మెలిగేలా పరిస్థితులు కల్పించాలని ఆనంద భాస్కర్ సూచించారు.