80 లక్షలు వసూలు: చిట్టీల బుజ్జమ్మ పరారీ
తిరుపతి: రెండేళ్లుగా చిట్టీలు వేస్తు పేదల నుంచి దాదాపు 80 లక్షల రూపాయలు వసూలు చేసుకుని బుజ్జమ్మ (65) అనే మహిళ అదృశ్యమైంది. దీంతో బాధితులు శుక్రవారం ఆమె ఇంటి ధర్నాకు దిగారు. తమ డబ్బు ఇవ్వాలంటు నినాదాలు చేశారు. అయితే బుజ్జమ్మ కనపడకపోవడం, కుటుంబ సభ్యులు సమాధానం చెప్పక పోవడంతో మోసపోయినవారిలో ముగ్గురు మహిళలు ఆమె ఇంటివద్దే కిరోసిన్ పోసుకుని నిప్పంటుకునేందుకు ప్రయత్నించారు. అయితే వీరిని కొందరు అడ్డుకున్నారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అలిపిరి పోలీసులు అక్కడకు చేరుకుని బుజ్జమ్మ కొడుకు, కోడలిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి-రేణిగుంట మార్గంలోని కాటన్ మిల్లు సమీపంలో పూలవాని గుంట, గొల్లవాని గుంట ప్రాంతాల్లో నివసిస్తున్న బుజ్జమ్మ గత రెండేళ్లుగా చిట్టీలు నిర్వహిస్తోంది. 50వేల నుంచి 3లక్షల వరకు చిట్టీలు వేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగైన తన భర్త మరణంతో వస్తున్న పెన్షన్తో జీవిస్తున్న బుజ్జమ్మ పెద్ద కొడుకు ఎన్సిసిలో పనిచేస్తున్నాడు.

రెండేళ్ల కాల వ్యవధితో బుజ్జమ్మ దగ్గర చిట్టీలు వేసినవారు దాదాపు 34 మందిదాకా ఉన్నారు. వీరికి చీటి డబ్బులు మూడు నెలల క్రితమే ఇవ్వాల్సి వుంది. అయితే ఎవరికి డబ్బులు ఇవ్వకుండా తిప్పించుకుంటున్న బాధితులు కొద్దిరోజుల క్రితం అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో గురువారం ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. తమ చిట్టీ డబ్బులు ఇవ్వాల్సివున్నా ఇవ్వకపోగా, డబ్బులు ఇచ్చేదిలేదు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని బుజ్జమ్మ కొడుకు బెదిరించడంతో శుక్రవారం బాధితులంతా బుజ్జమ్మ ఇంటి ముందు బైఠాయించి ధర్నాకు దిగారు.
మూడు రోజులుగా బుజ్జమ్మ కనిపించకపోవడంతో బాధితుల్లో ఆందోళన ఎక్కువైంది. ఈ సమయంలో ముగ్గురు మహిళలు తమ డబ్బులు తమకు ఇవ్వకపోతే బుజ్జమ్మ ఇంటిముందే ఆత్మహత్య చేసుకుంటామని కిరోసిన్ తెచ్చి పోసుకోవడం గమనించిన మిగిలినవారు వారిని అడ్డుకున్నారు. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న అలిపిరి పోలీసులు బుజ్జమ్మ పెద్దకొడుకు వెంకటకృష్ణప్రసాద్, అతని భార్యను అదుపులోకి తీసుకున్నారు. బాధితులు ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేశారు. కాగా ఈ సందర్భంగా పోలీసుల జీపును బాధితులు అడ్డుకున్నారు.












Click it and Unblock the Notifications