ఏవోబీలో పోలీసులు,మావోయిస్టుల మధ్య కాల్పుల యుద్ధం...మహిళా మావోయిస్టు మృతి
విశాఖపట్నం:ఆంధ్రా సరిహద్దు ఒడిషా (ఏవోబీ) సరిహద్దుల్లో జరిగిన మావోయిస్టులతో జరిగిన కాల్పుల యుద్దంలో ఒక మహిళా మావోయిస్టు పోలీసుల గన్ ఫైర్ లో మృతి చెందినట్లు విశాఖపట్టణం రూరల్ ఎస్పీ రాహుల్ దేశ్శర్మ తెలిపారు.
ఏవోబీలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో అండ్రపల్లి దగ్గర పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారని ఎస్పీ చెప్పారు. దీంతో పోలీసులు- మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగగా...పోలీసుల కాల్పుల ధాటికి మహిళా మావోయిస్టు మృతి చెందగా...మరి కొందరు మావోయిస్టులు గాయపడి ఉండొచ్చన్నారు. మృతిచెందిన మహిళా మావోయిస్టు రానాగా పోలీసులు గుర్తించారు.
ఇదిలావుంటే హఠాత్తుగా అరకు దాడితో పెను ప్రకంపనలు రేపిన మావోయిస్టులు ఒడిషాలో షెల్టర్ తీసుకుని ఏవోబీలోని సరిహద్దు ప్రాంతాల్లోకి వచ్చి మళ్లీ దాడులు చేసేలా వ్యూహాలు రచిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందిందట. ఈ వ్యూహాలకు ఇందుకు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, చలపతి తదితర కీలక నేతలు స్కెచ్ లు రెడీ చేస్తున్నట్లు పోలీసులకు తెలిసిందట. అంతేకాదు చత్తీస్గఢ్లో మావోయిస్టులకు ఏకంగా మిలటరీ బెటాలియన్ వంటిదే ఉన్నట్లు తాజా విచారణలో వెల్లడి కావడం పోలీసులను విస్తుపోయేలా చేసింది.
అరకు దాడి అనంతరం తమ ప్రతిష్ట దారుణంగా దెబ్బతిన్న నేపథ్యంలో మావోయిస్టుల ఆచూకి కనుగొనేందుకు పోలీసులు ఎక్కువగా టెక్నాలజీ పైనే ఆధారపడ్డారట. ప్రస్తుతం ఏవోబీలో స్కానింగ్ టెక్నాలజీని వాడుతున్న పోలీసులు త్వరలోనే డ్రోన్లు విరివిగా వినియోగించనున్నారు. రేడియో ట్రాన్సిస్టర్ మాదిరిగా ఉండే పరికరాన్ని ఎతైన ప్రదేశంలో అమర్చి దాని యాంటేనా ద్వారా స్కానింగ్ పద్ధతిని ప్రస్తుతం పోలీసులు అనుసరిస్తున్నారు. దీని ద్వారా ప్రస్తుతం మావోయిస్టులు వినియోగించే వైర్లెస్సెట్, మొబైల్ ఫోన్ల ద్వారా జరిగే సంభాషణలను రికార్డు చేయడంతోపాటు వారు ఏ ప్రాంతంలో, ఎంత దూరంలో ఉన్నారో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
కొద్దిరోజుల క్రితమే ఎపి డిజిపి ఆర్పీ ఠాకూర్, ఒడిషా డీజీపీ శర్మతో సమావేశమై ఉమ్మడి కార్యాచరణకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే కోరాపుట్ జిల్లా చిక్కల్ములి వద్ద శని, ఆదివారాల్లో ఇరు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించగా...ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు గాయపడినట్టు పోలీసులు చెప్పారు. అయితే వారెరనేది నిర్ధారణ చేయలేకపోవడం గమనార్హం.
మహిళా మావోయిస్టు రానా, ఎమ్మెల్యే హత్య కేసులో నిందితురాలు. అనంతరం నిర్వహించిన ఈ కూంబింగ్లో మరో నలుగురు మావోయిస్టులు జయంతి, రాధిక, గీత, రాజశేఖర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది.