నా నోటితో చెప్పలేను: విజయమ్మ ఓటమిపై లగడపాటి
హైదరాబాద్: విశాఖ లోకసభ స్థానం నుండి పోటీ చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ గెలుస్తారో, ఓడుతారో తన నోటీతో తాను చెప్పలేనని విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు, ప్రముఖ వ్యాపారవేత్త లగడపాటి రాజగోపాల్ మంగళవారం అన్నారు.
ఆయన ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడారు. వైయస్ రాజశేఖర రెడ్డి అంటే తనకు చాలా గౌరవమని చెప్పారు. వైయస్ సతీమణిగా విజయమ్మ అంటే కూడా తనకు అపారమైన గౌరవం ఉన్నాయని చెప్పారు. అలా అని ఆమె విశాఖలో గెలుస్తుందని చెప్పలేనని తెలిపారు.
విశాఖ, మల్కాజిగిరి స్థానాలు పట్టణ ప్రాంతాలు అని అక్కడ విజయం సాధించడం కష్టంతో కూడుకున్న పని అన్నారు. అందుకే విశాఖలో విజయమ్మ విజయం సాధిస్తుందని తాను భావించడం లేదన్నారు. అయితే ఆమె పైన ఉన్న గౌరవంతో తన నోటీతో తాను ఆమె ఓడిపోతుందని చెప్పలేనన్నారు.
విజయమ్మకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కంభంపాటి హరిబాబుతో హోరాహోరీ ఉంటుందని చెప్పారు. విశాఖ, మల్కాజిగిరి స్థానాల నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి కీలక అభ్యర్థులను బరిలోకి దింప వద్దని తాను సూచించానని తెలిపారు.