పారిపోయారు: అధిష్టానాన్ని కడిగిపారేసిన లగడపాటి
గుంటూరు: విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ సోమవారం మరోసారి కాంగ్రెసు పార్టీ అధిష్టానం పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శీతాకాల సమావేశాలు నిర్వహించకుండా పారిపోయిన కేంద్ర ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో పార్లమెంటును నడిపే శక్తి లేదన్నారు. ఫిబ్రవరిలో పార్లమెంటు సమావేశాలు ఒక్కరోజు కూడా జరగకుండా అడ్డుకుంటామన్నారు. ఆయన గుంటూరు జిల్లాలో మాట్లాడారు.
తాము సమైక్యాంధ్ర కోసం సొంత పార్టీ మీద తిరగబడి పోరాటం చేస్తున్నామన్నారు. రాజ్యసభ అభ్యర్థులు సమైక్యవాదులు లేకుండా ఎమ్మెల్యేలు వారిని ఓడిస్తారని చెప్పారు. తాము సమైక్యవాదులకే ఓటు వేస్తామని చెప్పారు. అభ్యర్థులను ప్రకటించాక తమ నిర్ణయం ఉంటుందని చెప్పారు.
మంచి మార్గంతో వెళ్తే విజయం దానంతట అదే వస్తుందని తమ ప్రిన్సిపల్ చెప్పారన్నారు. రాష్ట్ర సమైక్యతతోనే మన యోగక్షమాలు ఆధారపడి ఉన్నాయన్నారు. కాంగ్రెసు పార్టీ విభజనపై తన నిర్ణయం మార్చుకోకుంటే ఇరవై ఐదు లోకసభ నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా దక్కవని హెచ్చరించారు.
సమైక్యాంధ్ర కోసం విద్యార్థి, మేథావులను ఏకం చేస్తామని చెప్పారు. కేంద్రం విభజనపై మొండిగా ఉంటే 25 స్థానాల్లో నీళ్లు వదులుకోవాల్సిందేనన్నారు. కాంగ్రెసు పార్టీని రాష్ట్రంలో రెండుసార్లు గెలిపిస్తే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా అని ప్రశ్నించారు. తాము ప్రేమానురాగాలతో సమైక్యాంధ్ర సాధిస్తామన్నారు.
కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.