పవన్ కళ్యాణ్ చంద్రబాబు మనిషే..కుక్క తోక పట్టుకుని గోదారి ఈదుతున్న బీజేపీ: లక్ష్మీపార్వతి ఏకిపారేశారుగా!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైయస్ఆర్ సీపీ నేత, తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై, లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ పై సైతం లక్ష్మీపార్వతి విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు టీడీపీని సర్వనాశనం చేశారు .. ఎన్నికల ప్రచారంలో లక్ష్మీ పార్వతి
టీడీపీని చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం సర్వనాశనం చేశారని లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తో కలిసి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి బరిలోకి దిగిన గురుమూర్తిని గెలిపించాలని తిరుపతిలోని పలు డివిజన్లలో ప్రచారం నిర్వహించిన లక్ష్మీపార్వతి చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి దెబ్బకు పదేళ్లు ఇంటికే పరిమితమైన చంద్రబాబు 2014 లో ఒక శాతం అధిక ఓట్లతో సీఎం అయ్యాడని, ఆ ఐదేళ్లు ప్రజలను పీడించే పిప్పి చేశాడని తీవ్ర విమర్శలు గుప్పించారు.
లోకేష్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి అవినీతితో లక్షల కోట్లు సంపాదించాడు
నందమూరి తారక రామారావు పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ కలిసి సర్వనాశనం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన కొడుకు లోకేష్ ను రాజకీయాల్లోకి తీసుకు వచ్చి, అవినీతి తో లక్షల కోట్లు సంపాదించాడని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. చంద్రబాబు గవర్నమెంట్ లో జరిగిన దారుణాలు అన్నీ ఇన్ని కావని, చెట్టు నీరు దగ్గర్నుంచి పోలవరం ప్రాజెక్ట్ వరకు అవినీతి జరిగిందని పేర్కొన్నారు .
పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు .. లక్ష్మీ పార్వతి సూటి ప్రశ్నలు
ఇక పవన్ కళ్యాణ్ పైన తీవ్ర విమర్శలు గుప్పించిన లక్ష్మీపార్వతి తిరుమల పవిత్రత పై లేనిపోనివి, పవన్ హిందూ మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి హయాంలో కూల్చిన దేవాలయాలపై ఎందుకు నోరు మెదప లేదని ప్రశ్నించారు లక్ష్మీపార్వతి .సినిమాల్లో డబ్బులు సంపాదిస్తున్నాను అని తనంత నీతిమంతుడు లేడని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ విజయవాడ లో వచ్చిన ఆస్తులు ఎక్కడివో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు లక్ష్మీపార్వతి . చంద్రబాబు నాయుడు ఎంత ప్యాకేజీ ఇచ్చాడు , లింగమనేని రమేష్ ఇచ్చిన ఆస్తుల గురించి అందరికీ తెలుసన్నారు.
బీజేపీని చూస్తే జాలేస్తోంది .. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదుతుంది
ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు మనిషిలానే పని చేస్తున్నాడని ఆరోపించారు. బిజెపిని చూస్తే జాలేస్తుందని పేర్కొన్న లక్ష్మీపార్వతి నేషనల్ పార్టీ పరిస్థితి తలచుకుంటే పాపం అనిపిస్తుంది అన్నారు. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టు బీజేపీ పరిస్థితి ఉందని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. కనీసం ఒక్క సీటు సీటు కూడా గెలవలేని వ్యక్తిని నమ్ముకుని బిజెపి ముందుకు వెళ్లడం పై ఆశ్చర్యంగా ఉందని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ప్రజలు వైసీపీ కి పట్టం కట్టడం ఖాయమని పేర్కొన్న లక్ష్మీపార్వతి అటు చంద్రబాబుపై, పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.