లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు మరో అవాంతరం: నిర్మాతకు ఈసీ నోటీసులు
అమరావతి: ఊహించిందే జరుగుతోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల వ్యవహారంలో మరో ట్విస్ట్ వచ్చి పడింది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా..తాజాగా మరో అవాంతరం ఎదురైంది. ఆ అవాంతరం కూడా ఎన్నికల సంఘం నుంచి కావడంతో విడుదలపై ఉత్కంఠత ఏర్పడుతోంది.
తండ్రి ఇలాకాలో తనయుడి పోటీ, ఆజంఘడ్ బరిలో అఖిలేష్ యాదవ్
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పూర్తిగా రాజకీయపరమైన చిత్రం కావడం, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రను ఉన్నది ఉన్నట్టుగా చూపడం, ఎన్నికల సీజన్ కావడంతో సినిమా ప్రభావం తెలుగుదేశం పార్టీపై ప్రతికూలంగా పడుతుందనే సందేహాలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో- నిర్మాతకు ఎన్నికల సంఘం నోటీసులు పంపించడం చర్చనీయాంశమైంది.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నిర్మాత రాకేష్ రెడ్డి. జీవీ అండ్ జీవీ ఫిల్మ్స్ బ్యానర్ పై రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. వివాదాస్పద దర్శకుడిగా ముద్ర పడిన రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు బయోపిక్ ఇది. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎలాంటి మానిసిక క్షోభను అనుభవించారు? ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు? చంద్రబాబు పాత్ర ఏమిటి? ఎన్టీఆర్ ఎలా పదవీచ్యుతుడయ్యారు? అనే అంశాల చుట్టే సినిమా తిరుగుతుంది.
ఇందులో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విలన్ గా చూపించారనే విమర్శలు ఉన్నాయి. అందుకే- తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ సినిమా విడుదలను అడ్డుకోవడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. న్యాయస్థానాల్లోనూ పిటీషన్ వేసినా, వారికి అనుకూల ఫలితం రాలేదు. దీనితో సినిమా విడుదల కావడం ఖాయమేనని అనుకుంటున్న సమయంలో.. ఈ సారి ఏకంగా ఎన్నికల కమిషన్ నుంచే నిర్మాతకు నోటీసులు రావడంతో.. మరోసారి అనుమానాలు ఏర్పడ్డాయి.
సోమవారం ఉదయం రాకేష్ రెడ్డి.. ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ ముందు హాజరు కావాల్సి ఉంటుంది. సినిమా కథాంశం, విడుదల వంటి విషయాలపై ఆయన ద్వివేదీకి వివరణ ఇచ్చుకోవాలి. ఆయన ఇచ్చే వివరణ సంతృప్తికరంగా ఉంటే సినిమా విడుదలకు ఢోకా ఉండదని అంటున్నారు. లేదంటే- కష్టమేనని చెబుతున్నారు.