రోటోవేటర్తో తొక్కించి: రెచ్చిపోయిన రంజిత్.., పొలంలోనే విమలమ్మ హత్య..
Recommended Video
చిత్తూరు: పొలం తగాదా విషయంలో ఉన్మాదిలా వ్యవహరించిన ఓ వ్యక్తి మహిళను పొట్టనబెట్టుకున్నాడు. రొటోవేటర్తో తొక్కించి మరీ అత్యంత కిరాతకంగా ఆమెను హత్య చేశాడు.
ఆమె భర్తపై కూడా ఇనుప రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం వరిగపల్లెలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం:
వరిగపల్లెకు చెందిన జగన్నాథరెడ్డికి అదే గ్రామానికి చెందిన రంజిత్కు మధ్య కొన్నేళ్లుగా పొలం గట్టు వివాదం నడుస్తోంది. దీనిపై కోర్టు కేసు విచారణలో ఉంది. ఇదే క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం జగన్నాథరెడ్డి.. వివాదం నెలకొన్న పొలంలో ట్రాక్టర్తో దున్నడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతని భార్య విమలమ్మ(52) కూడా అక్కడే ఉంది.
గొడవపడ్డ రంజిత్ సన్నిహితుడు:
జగన్నాథరెడ్డి పొలం దున్నుతున్నాడన్న విషయం తెలుసుకుని.. రంజిత్ సన్నిహితుడైన గోవిందరాజులు వారిని అడ్డుకున్నాడు. దీంతో దున్నడం ఆపేసి.. అతనితో మాట్లాడేందుకు జగన్నాథరెడ్డి, విమలమ్మ ఇద్దరూ గట్టు పైకి వచ్చారు.
రెచ్చిపోయిన రంజిత్ :
గోవిందరాజులు-జగన్నాథ రెడ్డి మధ్య వాగ్వాదం నడుస్తున్న సమయంలోనే.. ఈ విషయం రంజిత్ కు చేరింది. దీంతో హుటాహుటిన అక్కడికి వచ్చిన రంజిత్.. తీవ్ర కోపోద్రిక్తుడయ్యాడు. రోటోవేటర్ బిగించిన ట్రాక్టర్తో జగన్నాథరెడ్డికి చెందిన జొన్న పంటను తొక్కించాడు.
ఉన్మాదిలా మారి.. హత్య
అదే ట్రాక్టర్తో పొలం గట్టుపై నిలబడి ఉన్న భార్య విమలమ్మను ఢీకొట్టాడు. విమలమ్మ కిందపడిపోగా.. ఆమె పైనుంచే రోటోవేటర్ ఎక్కించాడు. దీంతో విమలమ్మ అందులో ఇరుక్కుపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అక్కడితో ఆగకుండా.. విమలమ్మ భర్త జగన్నాథరెడ్డిపై కూడా రంజిత్ ఇనుప రాడుతో దాడి చేశాడు. దీంతో అతని తలకు బలమైన గాయమైనట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.