గృహ హక్కు వసూళ్ళ కోసమే .. దండుకోవటంలో జగన్ స్పెషలిస్ట్: లంకా దినకర్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిరుపేదల ఇళ్ళకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తానని తీసుకొచ్చిన స్కీమ్ ఇప్పుడు ఏపీలో విమర్శలకు కారణంగా మారింది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రభుత్వ స్థలాల్లో గృహాలు నిర్మించుకొని, గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొందిన లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లకు యాజమాన్య హక్కులు కల్పించడం కోసం రూపొందించబడిందని ప్రభుత్వం చెప్తున్నా, గతంలో ఇళ్ళ మీద రుణాలు తీసుకుని ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన వారికి నాడు తీసుకున్న లోన్స్ తాలూకు డబ్బు చెల్లించాలని ఆదేశాలు జారీ చెయ్యటంతో ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది.

గతంలో గృహ రుణాల లబ్దిదారులకు చుక్కలు చూపిస్తున్న జగన్ సర్కార్
స్థలాలు కొనుక్కుని, ఇల్లు కట్టుకుని, గత ప్రభుత్వాల హయాంలో గృహనిర్మాణానికి లబ్ధి పొందినవారి వివరాలు పాతవన్నీ తిరగతోడుతూ ఏపీ సర్కార్ ఇచ్చిన షాక్ కు జనాలు కోలుకోలేకపోతున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొందిన లబ్దిదారులు గ్రామీణ ప్రాంతాలలో అయితే రుణ గ్రహీతలు 10000, మునిసిపాలిటీలలో అయితే రుణ గ్రహీతలు 15,000, కార్పొరేషన్ల పరిధిలో 20000 చెల్లించాలని అధికారులు ఊరూరా తిరుగుతూ హంగామా చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా జగన్ నిర్ణయంపై ప్రజల్లో ఆగ్రహం
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ప్రజలు జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇంటి రుణాలను, ఇప్పుడెందుకు చెల్లించాలంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయం లేక ఈ రకంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వసూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. పేదలకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం పేదల నుండి డబ్బులు దండుకోవాలని ప్రయత్నించడం అన్యాయమని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పరిస్థితులపై ఏపీలో ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ పాలనలో వ్యాపార చాయలు ఎక్కువ అంటూ లంకా దినకర్
రాష్ట్రంలో సంపూర్ణ గృహ హక్కు పథకం అంటూ నిరుపేదల నుండి డబ్బులు వసూలు చేస్తున్న జగన్ సర్కార్ పై బిజెపి నేత లంకా దినకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి కన్నా వ్యాపార చాయలు ఎక్కువయ్యాయని ఆయన పేర్కొన్నారు. సంక్షేమం కూడా ప్రణాళికాబద్ధంగా లేదని లంకా దినకర్ ఆరోపించారు. పేద, మధ్య తరగతి వర్గాల పాత గృహ లబ్ధిదారుల నుంచి కొత్త విధానాలతో డబ్బులు దండుకోవడంలో జగన్మోహన్ రెడ్డి స్పెషలిస్ట్ అని ఆయన పేర్కొన్నారు.

పేద ప్రజలకు ఇచ్చిన ఇళ్లపైన ఓటీఎస్ పిడుగు.. వైసీపీ సర్కార్ దందాల సర్కార్
గత ప్రభుత్వాలు ఎప్పుడో పేద ప్రజలకు ఇచ్చిన ఇళ్లపైన ఓటీఎస్ పిడుగు నెత్తిన వేయడం జగన్ మార్క్ పాలనకు నిదర్శనమని లంకా దినకర్ మండిపడ్డారు. కట్టిన ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వకుండా, కొత్త ఇల్లు సరిగ్గా కట్టకుండా వైసిపి ప్రభుత్వం పేదల నుంచి వసూలు మొదలు పెట్టిందని, ఇక అవే ఇళ్లకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అంటూ సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటూ మండిపడ్డారు. నిరుపేదలకు నవరత్నాలు అంటూ, పేదల నెత్తిన నవశఠగోపాలు పెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం దందాల ప్రభుత్వం గా మారిందని లంక దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications