అవినీతిపై ఆయనా: పార్వతి, తుపాకి రాముడన్న గట్టు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీ పార్వతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై చంద్రబాబుకు ఒక స్పష్టమైన విధానమంటూ లేదని, చంద్రబాబు వైఖరితో తెలుగుదేశం పార్టీ ప్రజలకు దూరమవుతోందని లక్ష్మీ పార్వతీ అన్నారు.
సమైక్యాంధ్రపై చంద్రబాబు తన వైఖరిని స్పష్టంగా చెప్పకుండా, దాగుడు మూతలు ఆడుతున్నారని ఆమె ఆరోపించారు. విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రజలు ఉద్యమిస్తుంటే.. చంద్రబాబు అవకాశ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అవినీతిపై చంద్రబాబు మాట్లాడటం విడ్డూరమని లక్ష్మీ పార్వతి అన్నారు. అవినీతి రహిత సమాజమంటూ గొప్పలు చెప్పే ముందు, తాను అవినీతికి పాల్పడటం మానుకోవాలని చంద్రబాబుకు లక్ష్మీ పార్వతి సూచించారు.
చంద్రబాబు ఓ తుపాకి రాముడు: గట్టు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఓ తుపాకి రాముడని ఎద్దేవా చేశారు. తన తొమ్మిదేళ్ల పాలన గురించి చంద్రబాబు ఎప్పుడూ చెప్పుకోలేరని ఆయన అన్నారు.
చంద్రబాబు హయాంలో అవినీతి ఎలా పెరిగిందో తెలుసుకోవాలంటే.. ఎకానమి సర్వే చూడాలని అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలకు ప్రజలు నవ్వుకుంటున్నారని గట్టు రామచంద్రరావు అని తెలిపారు. అంతేగాక తెలుగుదేశం పార్టీని ఒక డ్రామా కంపెనీగా ఆయన అభివర్ణించారు. ప్రపంచంలో ఎవరు గెలిచినా సంబరాలు జరుపుకోవడం చంద్రబాబుకు అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు.
తనపై సిబిఐ దర్యాప్తు జరపకుండా ఉండేందుకే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రోజా ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, సొసైటీ ఎన్నికలు, ఉప ఎన్నికలు, ఇప్పుడు రాష్ట్ర విభజనలో కూడా చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయ్యారని రోజా విమర్శించారు.